జనవరి - 2014 వార్తల్లో వ్యక్తులు


జనవరి - 7
¤   అమెరికాలోని భారత సంతతి నాడీ శాస్త్రవేత్త ఖలీల్ రజాక్‌కు అక్కడి జాతీయ సైన్స్ ఫౌండేషన్ (ఎన్ఎస్ఎఫ్) సుమారు రూ.5.21 కోట్లు (8,66,902 డాలర్లు) మంజూరు చేసింది.
       »  వయసుతోపాటు వచ్చే వినికిడి సమస్యలకు చికిత్స చేసేందుకు ఉపయోగపడేలా మెదడు చర్యా విధానంపై ఆయన కొద్దికాలంగా పరిశోధనలు చేస్తున్నారు. ఇవి కొనసాగించేందుకు అయిదేళ్లకు ఆయనకు ఈ మొత్తం బహూకరించారు.
       »  చెన్నైకి చెందిన రజాక్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో మానసిక, నాడీశాస్త్రాల సహాయ ఆచార్యుడిగా పని చేస్తున్నారు.
¤   భారత సంతతికి చెందిన ముగ్గురు అమెరికన్లను న్యాయమూర్తులు (ఫెడరల్ జడ్జిలు)గా నియమించాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సెనెట్‌కు ప్రతిపాదించారు.
       »  ప్రస్తుతం శాన్‌ఫ్రాన్సిస్కోలో డిప్యూటీ సిటీ అటార్నీగా ఉన్న విన్స్ గిర్‌ధారి ఛాబ్రియాను ఉత్తర కాలిఫోర్నియా జిల్లా న్యాయమూర్తిగా, ఇల్లినాయిస్ ఉత్తర జిల్లా న్యాయస్థానంలో అసిస్టెంట్ అటార్నీగా ఉన్న మనీష్ షాను అక్కడే జిల్లా జడ్జిగా నియమించాలని కోరారు. బోస్టన్‌కు చెందిన 'సెగల్ రోయిట్ మన్' అనే న్యాయసేవా సంస్థ భాగస్వామి ఇందిరా తల్వానీని మసాచుసెట్స్ జిల్లా న్యాయమూర్తిగా నియమించాలని ఒబామా కోరారు.
¤   యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఛైర్‌పర్సన్‌గా జనెట్ ఎలెన్ నియామకానికి సెనెట్ ఆమోదముద్ర వేసింది. దీంతో 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఫెడ్ రిజర్వ్‌కు తొలి మహిళా ఛైర్‌పర్సన్‌గా ఎలెన్ రికార్డు సృష్టించారు.
       »  67 ఏళ్ల ఎలెన్ ప్రస్తుతం ఫెడ్ వైస్ ఛైర్‌పర్సన్‌గా  ఉన్నారు.
  
       »  జనవరి 31న ప్రస్తుత ఛైర్మన్ బెన్ బెర్నాంకే పదవీ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు.
జనవరి - 8
 ¤    ప్రముఖ నర్తకి, సామాజిక కార్యకర్త మల్లికా సారాభాయి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో చేరారు.
       »   మల్లికా సారాభాయి 2009లో గాంధీనగర్ స్థానం (గుజరాత్) నుంచి స్వతంత్ర అభ్యర్థిగా భాజపా అగ్రనేత అద్వానీపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
జనవరి - 9
¤    భారత సంతతికి చెందిన అమెరికన్ దినేష్ పటేల్ అమెరికాలోని మిచిగాన్ విశ్వవిద్యాలయానికి రూ.62 లక్షల విరాళాన్ని అందించారు.
      »   ఉతా రాష్ట్రంలో ప్రముఖ వ్యాపారి అయిన దినేష్ పటేల్ విశ్వవిద్యాలయ సలహా బృందానికి అధ్యక్షుడిగా ఉండేందుకు కూడా అంగీకరించారు.
¤      ప్రముఖ సామాజిక కార్యకర్త, సమాచార హక్కు ఉద్యమకారిణి అరుణారాయ్‌కి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.
     »   హెచ్‌సీయూ ఉపకులపతి సిహెచ్.హనుమంతరావు, ఉపకులపతి రామకృష్ణ రామస్వామి చేతులమీదుగా అరుణారాయ్ హైదరాబాద్‌లో డాక్టర్ ఆఫ్ లిటరేచర్‌ను అందుకున్నారు.

 జనవరి - 12
¤      ప్రఖ్యాత టైమ్స్ పత్రిక కోసం 'యుగోవ్' సంస్థ రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ఆరాధ్యనీయ 30 మంది వ్యక్తుల జాబితాలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ మొదటి స్థానంలో నిలిచాడు.
     » భారత్ సహా బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, అమెరికా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, ఇండోనేషియా, చైనా, ఈజిస్ట్, నైజీరియా, బ్రెజిల్ (మొత్తం 13 దేశాలు)లలో 14 వేల మందిని సర్వే చేసి ఈ జాబితాను రూపొందించారు.     » అత్యంత ఆరాధ్యనీయులైన 30 మందిలో మొత్తం ఏడుగురు భారతీయులు ఉండగా, తొలి పది మందిలో నలుగురు చోటు దక్కించుకున్నారు.     » అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మూడు, పోప్ ఫ్రాన్సిస్ నాలుగు, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అయిదో స్థానాల్లో నిలిచారు.     » చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, భాజపా ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోడి, ప్రపంచ కుబేరుడు వారెన్ బఫెట్, బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం వరుసగా ఆరు నుంచి పది స్థానాల్లో నిలిచారు.     » జాబితాలోని 30 మందిలో మహిళలు కేవలం ఆరుగురే. వారిలో తొలిస్థానం క్వీన్ ఎలిజబెత్ దక్కించుకున్నారు.
 జనవరి - 13
¤      విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ స్వతంత్ర కుమార్‌పై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలంటూ మాజీ న్యాయ విద్యార్థిని సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
     » విశ్రాంత న్యాయమూర్తులకు వ్యతిరేకంగా ఫిర్యాదులను అనుమతించేది లేదంటూ 2013 డిసెంబరు 5న సుప్రీంకోర్టు చేసిన తీర్మానాన్ని సవాలు చేస్తూ, న్యాయ విద్యార్థిని తాజా పిటిషన్‌ను దాఖలు చేశారు. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.కె.గంగూలీపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో సుప్రీకోర్టు వ్యవహరించిన రీతిలోనే తన ఫిర్యాదునూ పరిశీలించాలని ఆమె విన్నవించారు. సంఘటన జరిగిన సమయానికి జస్టిస్ స్వతంత్ర కుమార్ న్యాయమూర్తి పదవిలో ఉన్నారని పేర్కొన్నారు.
     »  ప్రస్తుతం జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ)కి నేతృత్వం వహిస్తున్న జస్టిస్ స్వతంత్ర కుమార్ ఈ పిటిషన్‌పై స్పందిస్తూ, అవి తప్పుడు ఆరోపణలని, ఇందులో ఏదో కుట్ర దాగుందని వ్యాఖ్యానించారు.
 జనవరి - 15
¤     ప్రముఖ భారత అమెరికన్ శాస్త్రవేత్త, ప్రఖ్యాత కార్నెగీ మెలన్ యూనివర్సిటీ అధ్యక్షుడు సుబ్రా సురేష్ చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (సీఏఎస్) సభ్యుడిగా ఎంపికయ్యారు.
     »  సీఏఎస్‌లో సభ్యత్వం దక్కడం చైనా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అత్యున్నత గౌరవంగా భావిస్తారు.
జనవరి - 16
¤     జెట్ ఎయిర్‌వేస్ సీఈవో గ్యారీ కెన్నెత్ టూమే తన పదవికి రాజీనామా చేశాడు.     »  2013 జూన్‌లోనే మూడేళ్ల కాంట్రాక్టుతో గ్యారీ టూమే పదవీ బాధ్యతలు స్వీకరించాడు.     »  గ్యారీ టూమే ఆస్ట్రేలియాకు చెందినవాడు.
జనవరి - 22
¤     ప్రతిష్ఠాత్మక 'ఇంటెల్ సైన్స్ టాలెంట్ సెర్చ్' పోటీలో 8 మంది భారత సంతతి విద్యార్థులు ఫైనలిస్టులుగా నిలిచారు. అమెరికా నుంచి 40 మంది ఉన్నత పాఠశాలల పిల్లలు ఈ పోటీలో పాల్గొనగా, ఎనిమిది మంది ఫైనలిస్టులుగా మిగిలారు. ఏటా నిర్వహించే ఈ పోటీ పరీక్షను ఎంతో కఠినమైంది, అతిక్లిష్టమైంది, అత్యంత ప్రతిష్ఠాత్మకమైందిగా పేర్కొంటారు.
     »   ఫైనలిస్టులుగా నిలిచిన ఎనిమిది మంది విద్యార్థుల్లో అనుభవ్ గుహ, ప్రీతి కకాని (న్యూయార్క్), సిద్ధార్థ మోహతా (షికాగో), అజయ్ సైనీ (మసాచుసెట్స్), విష్ణుసర్కార్, శ్రేయస్ మిశ్రా (కాలిఫోర్నియా), ఆనంద్ శ్రీనివాసన్ (జార్జియా), పార్త్ ఠక్కర్ (నార్త్ కెరోలినా)లు ఉన్నారు.
     »   మార్చి 6 - 12 తేదీల్లో వాషింగ్టన్‌లో జరిగే తుది పరీక్షలో అవార్డు కోసం ఈ 8 మంది పోటీపడతారు.
జనవరి - 25
¤     ఢిల్లీ లోధీ కాలనీలోని ప్రభుత్వ పాలికా ప్రసూతి వైద్యశాలను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరవయ్యేళ్ల విజయ్ బాబా అనే రిక్షా కార్మికుడితో ప్రారంభింపజేశారు.
జనవరి - 26
¤     బ్రిటన్‌లో 500 మంది అత్యంత ప్రభావ శీలురైన వ్యక్తుల్లో భారత మూలాలు ఉన్న రచయిత, నోబెల్ బహుమతి విజేత వి.ఎస్.నైపాల్, పాకిస్థాన్ సాహస బాలిక మలాలా యూసఫ్ జాయ్‌లకు స్థానం లభించింది.     »   ప్రముఖ ప్రచురణ సంస్థ డెబ్రెట్స్, ద సండే టైమ్స్ పత్రిక కలిసి మొదటిసారి వివిధ రంగాల్లో '500 మంది ప్రభావ శీలురు' జాబితాను తయారు చేశాయి.
జనవరి - 31
¤     దివంగత న్యాయమూర్తి జస్టిస్ జె.ఎస్.వర్మకు ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని స్వీకరించేందుకు ఆయన భార్య పుష్ప నిరాకరించారు.     »   ఈ మేరకు పుష్ప రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. తన భర్త అవార్డులు, సన్మానాలను ఎప్పుడూ కోరుకోలేదని లేఖలో పేర్కొన్నారు.