జూన్ - 2014 అవార్డులు


జూన్ - 2
¤ భారత అగ్రశ్రేణి బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ సియట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు.   »    తక్కువ సమయంలోనే 100 టెస్టు వికెట్లు తీసిన ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 2013-14 సంవత్సరానికి ఇండియన్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును దక్కించుకున్నాడు.   »    శిఖర్ ధావన్ ఇంటర్నేషనల్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్‌గా, రాబిన్ ఉతప్ప అత్యుత్తమ దేశవాళీ క్రికెటర్‌గా ఎంపికయ్యాడు.   »    టెస్టు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గా ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్ ఎంపికయ్యాడు.   »    1983 ప్రపంచకప్ హీరో సయ్యద్ కిర్మాణీని జీవిత కాల సాఫల్య పురస్కారంతో సత్కరించారు.
జూన్ - 3
¤ జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (జీహెచ్ఐఏఎల్) నిర్వహణలో ఉన్న హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి రెండు అవార్డులు లభించాయి.   »    గత 5 సంవత్సరాల నుంచి ఏటా ప్రపంచంలోని అగ్రగామి మూడు విమానాశ్రయాల్లో స్థానం సంపాదించుకున్నందుకు గుర్తింపుగా 'ఏసీఐ డైరెక్టర్ జనరల్ రోల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్' అవార్డుతో ఎయిర్‌పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) ఈ విమానాశ్రయాన్ని గౌరవించింది. భారత్‌లో ఇటువంటి ఘనతను అందుకున్నది రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మాత్రమే.   »    ఏడాదికి 50 లక్షల మంది మొదలుకొని కోటిన్నరమంది ప్రయాణికులకు సేవలను అందిస్తున్న కేటగిరీలో ప్రపంచంలోకెల్లా 2013 సంవత్సరపు రెండో అత్యుత్తమ విమానాశ్రయంగా కూడా ఆర్‌జీఐఏ ను ఏసీఐ ఎంపిక చేసింది. ఆర్‌జీఐఏ అంతక్రితం ఏడాదిలో సైతం ఇదే స్థానాన్ని పొందడం గమనార్హం.
 జూన్ - 6
¤ క్యాన్సర్ వైద్య నిపుణుడు, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్టు బోర్డు సభ్యుడు నోరి దత్తాత్రేయుడు అమెరికాకు చెందిన ప్రతిష్ఠాత్మాక 'ఎల్లిస్ ఐలాండ్ మెడల్ ఆఫ్ ఆనర్' పురస్కారానికి ఎంపికయ్యారు.
జూన్ - 7 
¤  జాతి వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, నల్ల సూరీడు నెల్సన్ మండేలా గౌరవార్థం ఐక్యరాజ్య సమితి ఆయన పేరుతో ఒక అవార్డును నెలకొల్పింది.   »    న్యూయార్క్‌లో జరిగిన ఐరాస సర్వసభ్య సమావేశం 'ఐక్యరాజ్య సమితి నెల్సన్ రోలిహ్లహ్లా మండేలా' పురస్కారాన్ని నెలకొల్పుతూ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది.
జూన్ - 18
¤  ఆసియా నోబెల్ బహుమతిగా పేర్కొనే తాంగ్ ప్రైజ్‌కు నార్వే మాజీ ప్రధాని గ్రో హర్లెమ్ బ్రంట్‌ల్యాండ్ ఎంపికయ్యారు.   »    సంతులిత అభివృద్ధి అమలు, నాయకత్వం, నవ కల్పనలకుగాను ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు అవార్డుల ఎంపిక కమిటీ ఛైర్మన్, నోబెల్ బహుమతి గ్రహీత యువాన్ లీ ప్రకటించారు.   »    పారితోషికంలో నోబెల్ కంటే విలువైన తొలి తాంగ్ ప్రైజ్‌ను బ్రంట్‌ల్యాండ్‌కు ప్రకటించారు.   »    ఈ అవార్డు విలువ రూ.10 కోట్లు.¤  విదేశీయులకు రష్యా అందించే అత్యున్నత పౌర పురస్కారం 'ఆర్డర్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్‌'ను బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీకి ప్రదానం చేశారు.   »    భారత్‌లో పర్యటిస్తున్న రష్యా ఉప ప్రధాని దిమిత్రి ఓ రోగోజిన్ న్యూఢిల్లీలోని రష్యా రాయబారి కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని జోషీకి ప్రదానం చేశారు.
 జూన్ - 19
¤  భారత్‌లో పుట్టి అమెరికాలో స్థిరపడ్డ సంజయ్ రాజారాం అనే వృక్ష శాస్త్రవేత్త ప్రతిష్ఠాత్మక ప్రపంచ ఆహార పురస్కారం - 2014కు ఎంపికయ్యారు.   »    రాజారాం గోధుమ రకాలను సంకరీకరణం చేసి విశిష్ట జన్యు లక్షణాలు గల, అధిక ఉత్పత్తినిచ్చే గోధుమలను సృష్టించారు. ఆయన అభివృద్ధి చేసిన దాదాపు 480 గోధుమ రకాలను 51 దేశాల్లో విడుదల చేశారు. రాజారాం పరిశోధనల ఫలితంగా హరిత విప్లవం అనంతరం ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల టన్నులకు పైగా గోధుమ ఉత్పత్తి పెరిగింది.
   »    
రాజారాం ఉత్తరప్రదేశ్‌లో జన్మించారు. రూ.కోటికి పైగా విలువ గల ఈ పురస్కారాన్ని రాజారాంకు అక్టోబరులో ప్రదానం చేయనున్నారు.
 జూన్ - 20
¤  ప్రముఖ హిందీ కవి కేదార్‌నాథ్ సింగ్ (80 సంవత్సరాలు)కు 2013 సంవత్సరానికి గాను 49వ జ్ఞాన్‌పీఠ్ అవార్డును ప్రకటించారు.   »    ఇప్పటివరకు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకున్న హిందీ కవుల్లో కేదార్‌నాథ్ పదో వ్యక్తి.   »    ఉత్తరప్రదేశ్‌లోని బలియాలో జన్మించిన కేదార్‌నాథ్ సింగ్ పలు వ్యాసాలు, కథలు రాశారు. ఆయన రాసిన వాటిలో 'అభీ బిల్‌కుల్ అభీ', 'యహాన్ సే దేఖో' రచనలు ప్రముఖమైనవి.¤  మనుషుల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అవిశ్రాంత పోరాటం సాగిస్తున్న భారత ఉద్యమకారుడు భానుజ శరణ్‌లాల్‌కు అమెరికా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక 'ట్రాఫికింగ్ ఇన్ పర్సన్ హీరో' అవార్డును ప్రదానం చేసింది.   »    ఉత్తర భారత్‌లో మనుషుల అక్రమ రవాణకు వ్యతిరేకంగా ఆయన సారథ్యంలోని 'మానవ సన్‌సధన్ ఏవం మహిళా వికాస్ సంస్థాన్' విశేష కృషి చేస్తోంది.   »    భానుజ శరణ్‌లాల్‌తో పాటు నేపాల్‌కు చెందిన టెక్ నారాయణ్ కన్వర్, ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చెందిన చార్మెయిన్ గాంధీ ఆండ్రూస్‌కు కూడా ఈ అవార్డును ప్రదానం చేసింది.   »    ప్రపంచవ్యాప్తంగా మనుషుల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నవారికి అమెరికా ఈ అవార్డును ఇచ్చి సత్కరిస్తోంది. 
 జూన్ - 21
¤  భారత్‌కు చెందిన ప్రముఖ క్యాన్సర్ నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడుకి ప్రతిష్ఠాత్మక 'ఎ రికగ్నైజ్డ్ లీడర్ ఇన్ హిస్ స్పెషాలిటీ' పురస్కారం లభించింది.   »    న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ సంస్థ ఈ అవార్డును ప్రకటించింది.   »    ప్రస్తుతం నోరి దత్తాత్రేయుడు న్యూయార్క్ క్వీన్స్ అండ్ కార్నెల్ ఆస్పత్రి ఛైర్మన్‌గా, అమెరికాలోని అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు.   »    క్యాన్సర్ వ్యాధికి సంబంధించి న్యూమరస్ క్లినికల్ ట్రయల్స్, థెరపిటిక్ రేడియాలజీ అండ్ అంకాలజీ తదితర వాటిపై ఆయన అత్యున్నత పరిశోధనలు చేశారు. ఇటీవల క్యాన్సర్ వైద్యం కోసం అమెరికా వెళ్లిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి న్యూయార్క్‌లో వైద్యసేవలు అందించింది కూడా నోరి దత్తాత్రేయుడే.   »    ఆయన కర్నూలు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్, ఉస్మానియాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. 
జూన్ - 23
¤  బయోకాన్ ఛైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ మజుందార్ షాను జర్మనీకి చెందిన కీల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది వరల్డ్ ఎకానమీ సంస్థ '2014 గ్లోబల్ ఎకానమీ ప్రైజ్' తో సత్కరించింది.   »    సంస్థ శతవార్షికోత్సవం సందర్భంగా ఈ అవార్డును ఆమెకు ప్రదానం చేశారు.
జూన్ - 24
¤  సెల్‌ఫోన్ ద్వారా పౌరులకు ఈ-సేవలు అందించేందుకు భారత్ రూపొందించిన 'మొబైల్ సేవ' అప్లికేషన్ ఐక్యరాజ్యసమితి పురస్కారానికి ఎంపికైంది. దీన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ విభాగం రూపొందించింది.   »    ఐరాస పౌరసేవల పురస్కారాలు - 2014 లో రెండోశ్రేణి విభాగంలో భారత్ ఈ అవార్డు గెలుచుకుంది.   »    విద్యా వ్యవస్థ ఆధునికీకరణ, గ్రామీణ ప్రాంతాల్లో నీటి సౌకర్యం, ఆరోగ్య సదుపాయాలకు సంబంధించి వివిద దేశాలు రూపొందించిన నమూనాలు ఈ పురస్కారాలకు ఎంపికయ్యాయి.   »    మొత్తం 14 దేశాలు రూపొందించిన నమూనాలకు అవార్డులు దక్కాయి. జూన్ 26న సియోల్‌లో జరిగే కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేస్తారు.¤  నవజాత శిశువుల్లో వినికిడి లోపాలు, చెవుల పనితనం గుర్తించే ప్రక్రియను మరింత మెరుగుపరిచే పరికరాన్ని అత్యంత తక్కువ ఖర్చుతో ఆవిష్కరించిన భారత యువతి నితి కైలాస్‌కు ప్రతిష్ఠాత్మక రోలెక్స్ - 2014 అవార్డు లభించింది.   »    అహ్మదాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడీ)లో గ్రాడ్యుయేషన్ చేస్తున్న నితి కైలాస్‌కు లండన్‌లోని రాయల్ సొసైటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు.
జూన్ - 25
¤  పౌర హక్కుల నేత, దివంగత మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, ఆయన సతీమణి కొరెట్టా స్కాట్ కింగ్‌కు మరణానంతరం అమెరికా అత్యున్నత పౌర పురస్కారమైన 'యూఎస్ కాంగ్రెస్ గోల్డ్ మెడల్‌'ను ప్రకటించారు.   »    1960లలో అమెరికాలో పౌర హక్కుల ఉద్యమాన్ని ఈ దంపతులు ముందుండి నడిపారు. అమెరికాలో జాతి వివక్షకు తెరపడటానికి, తెల్లజాతి అమెరికన్లతో సమానంగా ఇతర అమెరికన్లకు కూడా ఓటు హక్కు కల్పించడానికి ఈ ఉద్యమం తోడ్పడింది.   »    'అమెరికా కాంగ్రెస్ గోల్డ్ మెడల్' పురస్కారాన్ని పొందినవారిలో నాటి పౌర హక్కుల ఉద్యమంలో తమ వంతు పాత్ర పోషించిన రోసా పార్క్స్ (1999), దొరొతి హైట్ (2004) ఉన్నారు. ¤  భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియా మహిళ మన్‌ప్రీత్ కౌర్ సింగ్‌కు 'అంతర్జాతీయ రేడియో అవార్డు' లభించింది.   »    కుటుంబ, గృహహింస సమస్యలపై తీసిన డాక్యుమెంటరీ చిత్రానికి ఆమెకు ఈ అవార్డును ప్రకటించారు.   »    ఆస్ట్రేలియాలోని భారత సంతతి కుటుంబాల్లో గృహహింస, కుటుంబ సమస్యలపై 'ది ఎనిమీ విత్ ఇన్' అనే పేరుతో మన్‌ప్రీత్ కౌర్ ఈ డాక్యుమెంటరీని నిర్మించారు.   »    మెల్‌బోర్న్ లోని పంజాబీ రేడియో ఛానల్‌లో మన్‌ప్రీత్ కౌర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.
 జూన్ - 27
¤  హైదరాబాద్ గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం (MANUU-మనూ)లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ షేక్ నౌకేజ్ అజ్మీ రచించిన 'మౌలానా ఆజాద్ కీ ఫర్సీ కిద్మత్' అనే పుస్తకానికి 2012 సంవత్సరానికి ఉత్తరప్రదేశ్ ఉర్దూ అకాడమీ పురస్కారం లభించింది.   »    డాక్టర్ నౌకేజ్ ఇప్పటికే పర్షియన్ సాహిత్యంపై పలు పుస్తకాలు రాశారు.   »    2012లో ఆయన యంగ్ స్కాలర్ ప్రెసిడెన్షియల్ అవార్డును అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ నుంచి అందుకున్నారు.¤  హైదరాబాద్‌లోని ఐఐసీటీ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ)లో శాస్త్రవేత్త (ఫిజికల్ కెమిస్ట్రీ విభాగం)గా పనిచేస్తున్న డాక్టర్ సూర్యప్రకాష్ సింగ్‌కు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక 'యంగ్ సైంటిస్ట్' అవార్డును ప్రదానం చేసింది.   »    ఆయనకు 2012లో సోలార్ సెల్స్‌పై చేసిన పరిశోధనలకు ఎన్ఏఎస్ఐ అవార్డు కూడా లభించింది. 
 జూన్ - 28
¤  అమెరికాలోని అట్లాంటాలో జరిగిన 'వరల్డ్ కప్ ఆఫ్ శాండ్ స్కల్ప్‌టింగ్-2014' పోటీలో భారత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్‌కు 'పీపుల్స్ చాయిస్' పతకం లభించింది.   »    'వృక్ష సంరక్షణ... భవిష్యత్ పరిరక్షణ' పేరుతో పట్నాయక్ ఇసుకతో సృష్టించిన అద్భుత శిల్పం ఈ బహుమతిని గెలుచుకుంది.
 జూన్ - 29
¤  తెలుగు విజ్ఞాన సమితి 62వ సంస్థాపక దినోత్సవాన్ని బెంగళూరులో ఘనంగా నిర్వహించారు.   »    ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు ఎం.మోహన్‌బాబు, సినీ నటి శారద, కవి, విమర్శకుడు హంపా నాగరాజయ్యను శ్రీకృష్ణదేవరాయ పురస్కారాలతో సత్కరించారు.