అక్టోబరు - 1
|
¤ ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ పురస్కారం రేసులో (భౌతికశాస్త్ర విభాగం) భారత సంతతికి చెందిన రామమూర్తి రమేష్ నిలిచారు. » చెన్నైకు చెందిన రమేష్ బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) పూర్వ విద్యార్థి. » ప్రస్తుతం బర్కిలీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో అధ్యాపకుడిగా పని చేస్తున్నారు. » ఈ ఏడాది నోబెల్ పురస్కార తుది పరిశీలన జాబితాలో మొత్తం 27మంది ఆర్థికవేత్తలు ఉండగా వారిలో రమేష్ ఒకరు.¤ ఆంధ్రప్రదేశ్ విజిలెన్స్ కమిషనర్గా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎస్.వి.ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. » మూడేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.
|
అక్టోబరు - 9
|
¤ సత్యేన్దాస్ అనే ఔత్సాహికుడు తాను సొంతంగా మార్పులు చేసుకున్న సైకిల్ రిక్షాపై కోల్కతా నుంచి 68 రోజుల్లో ప్రపంచంలోనే ఎత్తయిన (5369 మీటర్లు) హిమాలయ శిఖరాగ్రానికి చేరుకున్నాడు. » సైకిల్ రిక్షా పర్యావరణహిత రవాణా సాధనమని చాటిచెప్పడమే లక్ష్యంగా ఈ యాత్ర చేపట్టాడు.
¤ ప్రపంచంలో విలువైన అథ్లెట్ల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. » ఈ జాబితాలో 37 మిలియన్ డాలర్లతో అమెరికా బాస్కెట్ బాల్ ఆటగాడు లెబ్రాన్ జేమ్స్ అగ్రస్థానంలో నిలిచాడు. దిగ్గజ గోల్ఫర్ టైగర్వుడ్స్ 36 మిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. » 2007 తర్వాత వుడ్స్ అగ్రస్థానం కోల్పోవడం ఇదే తొలిసారి. టెన్నిస్స్టార్ రోజర్ ఫెదరర్ (32 మిలియన్ డాలర్లు) మూడో స్థానం సొంతం చేసుకున్నాడు. » టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని 20 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో అయిదో స్థానంలో నిలిచాడు. గతేడాది 21 మిలియన్ డాలర్లతో ఉన్నాడు. » ఉసేన్బోల్ట్ (6వ స్థానం), క్రిస్టియానో రొనాల్డ్ (7వ స్థానం), లయొనల్ మెస్సి (9వ స్థానం), రఫెల్ నాదల్ (10వ స్థానం). |
అక్టోబరు - 10
|
¤ 'హైబ్రిడ్ వరి పితామహుడి'గా పేరొందిన చైనా వ్యవసాయ శాస్రవేత్త యువాన్ లాంగ్పింగ్ తాజాగా సరికొత్త రికార్డులను సృష్టించారు. 0.0667 హెక్టార్ల విస్తీర్ణంలో సగటున 1,026.7 కిలోగ్రాముల వరిని పండించారు. » భారత్లోని బీహార్కు చెందిన రైతు సుమంత్ కుమార్ గతేడాది హెక్టారుకు ఏకంగా 22.4 టన్నుల వరిని పండించి సాధించిన రికార్డును యువాన్ అప్పట్లో ప్రశ్నించారు. తర్వాత తీవ్రంగా పరిశోధనలు సాగించి తాజాగా ఈ రికార్డును నెలకొల్పారు.¤ నలభై సంవత్సరాలకే ప్రపంచంలోని అత్యంత సంపన్నులుగా మారిన 40 మంది జాబితాను ఫార్చ్యూన్ ప్రచురించింది. ఇందులో నలుగురు భారతీయులు ఉన్నారు. » భారత్కు సంబంధించి హార్వర్డ్ యూనివర్సిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్ రాజ్ చెట్టి 16వ స్థానంలో నిలిచారు. ఢిల్లీలో జన్మించిన చెట్టి(35) ఆర్థిక చైతన్యంపై అధిక దృష్టి సారించారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి 23వ ఏటా పీహెచ్డీ పొందారు. బేబీ నోబెల్గా పరిగణించే జాన్ బేట్ క్లార్క్ మెడల్ను కూడా గతేడాది పొందారు. » మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ రాహుల్ శర్మ (37) కు 21 వ స్థానం దక్కింది. శర్మ మైక్రోమ్యాక్స్ను ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీగా ప్రారంభించారు. నెలరోజుల పాటు చార్జింగ్ ఉండే బ్యాటరీతో చౌక సెల్ఫోన్లను ఆవిష్కరించడం ద్వారా ఆయన మొబైల్ రంగంలో విజయవంతం అయ్యారు. » స్నాప్ డీల్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ కునాల్ బహల్ (31) ఈ జాబితాలో 25వ స్థానంలో నిలిచారు. పాఠశాలలో సహోధ్యాయి అయిన రోహిత్ బన్సల్తో కలిసి ప్రారంభించిన ఆన్ లైన్ పోర్టల్ స్నాప్ డీల్ మూడేళ్లలోనే దేశంలో పెద్ద మార్కెట్ ప్లేస్గా అవతరించింది. టాటా గ్రూప్ ఎమెరిటస్ ఛైర్మన్ రతన్ టాటా వ్యక్తిగత హోదాతో స్పాప్డీల్లో పెట్టుబడి పెట్టారు. » ట్విట్టర్ జనరల్ కౌన్సెల్ అయిన విజయ గద్దె(39) ఈ జాబితాలో 28వ స్థానంలో ఉన్నారు. పలు దేశాల్లో నిషేదించిన, ట్విట్టర్ను అంతర్జాతీయంగా విస్తరించడంతో విజయ కీలక పాత్ర పోషించారు. గత మార్చిలో టుర్కిష్ ప్రభుత్వం ట్విట్టర్పై విధించిన నిషేదాన్ని ఆమె అక్కడి కోర్టులో సవాలు చేశారు. » ఉబర్ సంస్థ సహ వ్యవస్థాపకుడు ట్రావిస్ కలనిక్ (38 ఏళ్లు), ఆతిథ్యరంగ సంస్థ ఎయిర్ బెనబ్ సీఈఓ బ్రెయిన్ చెస్కి (33) ఈ జాబితాలో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ (30) రెండో స్థానం దక్కించుకోగా, ఇటలీ ప్రధాని మత్తియో రెంజి (38) మూడో స్థానంలో నిలిచారు.
|
అక్టోబరు - 11
|
 ¤ రిలయన్స్ వాణిజ్య సామ్రాజ్యంలోకి మూడో తరం ఆరంగేట్రం చేసింది. ధీరూభాయ్ అంబానీ వారసుడు ముకేష్ అంబానీ కుమార్తె ఇషా(23) , కుమారుడు ఆకాష్(23)(కవల పిల్లలు)ను టెలికామ్, రిటైల్ విభాగాలైన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, రిలయన్స్ రిటైల్ వెంచర్స్లో డైరెక్టర్లుగా నియమించారు. » ఇషా అమెరికాలోని యేల్ యూనివర్సిటీలో మనస్తత్వ శాస్త్రం(సైకాలజీ), దక్షిణాసియా అధ్యయన శాస్త్రాల్లో పట్టభద్రురాలైంది. ఆకాష్ అమెరికాలో బ్రౌన్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో పట్టభద్రుడయ్యాడు. » రిలయన్స్ రిటైల్ దేశంలోని 148 నగరాల్లో 1723 విక్రయ కేంద్రాలను నడుపుతోంది.
|
|
అక్టోబరు - 12
|
¤ జర్మనీలోని డ్రెస్డన్లో నిర్వహించిన గణిత పోటీ 'మెంటల్ కాలిక్యులేషన్ వరల్డ్ కప్ - 2014' లో ఫాస్టెస్ట్ మెంటల్ కాలిక్యులేటర్గా భారత్కు చెందిన 13 ఏళ్ల గ్రంథ టక్కర్ నిలిచాడు. » ఎనిమిది అంకెలున్న సంఖ్యల గుణిజాలు, గత శతాబ్దిలోని రోజులు, వారాలు, సంఖ్యల వర్గమూలాలను సెకన్ల వ్యవధిలో పెన్ను, పేపర్, కాలిక్యులేటరు సాయం లేకుండా చెప్పి విజేతగా నిలిచాడు. |
|
అక్టోబరు - 14
|
¤ 25 మందితో కూడిన ప్రపంచ అత్యంత ప్రభావవంతమైన కౌమార బాలలు - 2014 జాబితాను టైమ్స్ మ్యాగజైన్ విడుదల చేసింది. » ఈ జాబితాలో నోబెల్ శాంతి బహుమతి విజేత మలాలా యూసఫ్ జాయ్తో పాటు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇద్దరు కుమార్తెలు సాషా (13), మలియా (16) కూడా స్థానం పొందారు. » పెన్సిల్వేనియాకు చెందిన బేస్బాల్ క్రీడాకారిణి మోనేడేవిస్ (13) ఈ జాబితాలో పిన్న వయస్కురాలు. » చైనాకు వ్యతిరేకంగా హాంకాంగ్ చేపట్టిన నిరసనలకు ప్రతిరూపంగా నిలిచిన జోషువా వాంగ్ (18), ట్రాన్స్ జెండర్ హక్కులకు మద్దతిస్తున్న జాజ్ జెన్సింగ్స్ (14), ప్రముఖ చెఫ్ ఫ్లిన్ మెక్గ్యారీ (15), వీడియో చాట్ ద్వారా పాఠాలు బోధించే వెబ్సైట్ను స్థాపించిన ఎరిక్ ఫిన్మెన్ (15), హాలీవుడ్ నటుడు విల్స్మిత్ కుమారుడు జేడెన్ స్మిత్ (17), ప్రముఖ మహిళా గోల్ఫర్ లిడియా కో (17), అఫ్ఘాన్ నేషనల్ సైక్లింగ్ బృందం సారధి సల్మా కకర్ (17)లు జాబితాలో నిలిచారు.¤ ప్రాణాంతకంగా మారిన ఎబోలాపై పోరాటానికి ఫేస్బుక్ సహ వ్యవస్థాపకుడు మార్క్ జూకర్ బర్గ్, ఆయన భార్య ప్రసిల్లా కలిసి 25 మిలియన్ డాలర్ల (సుమారు రూ.150 కోట్లు) విరాళాన్ని ప్రకటించారు.
|
అక్టోబరు - 15
|
¤ 'కౌన్ బనేగా కరోడ్పతి (కేబీసీ)' టీవీ షో తాజా సీజన్లో ముంబయికి చెందిన క్యాన్సర్ బాధితురాలు మేఘాపాటిల్ విజేతగా నిలిచి రూ.7 కోట్ల బహుమతి మొత్తాన్ని గెలుచుకుంది. ¤ అమెరికాలోని పెన్సిల్వేనియాలో పది నెలల చిన్నారి వెన్నా శాన్వి, ఆమె నానమ్మ సత్యవతి (61)ని దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడు ఎండమూరి రఘునందన్ (ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐటీ ఉద్యోగి)కు అమెరికా కోర్టు మరణ శిక్షను విధించింది.
|
అక్టోబరు - 17
|
¤ అమెరికాలోని ప్రతిష్ఠాత్మక కార్నగీ మెలన్ విశ్వవిద్యాలయం (సీఎంయూ) అధ్యక్షుడిగా ఉన్న ప్రముఖ భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త 'పద్మశ్రీ' సుబ్రా సురేష్కు అరుదైన గౌరవం లభించింది. » మలేరియా, రక్తసంబంధ వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్లకు సంబంధించిన కణ యంత్రాంగాలపై సురేష్ పరిశోధనలకు గుర్తుగా ఆయన్ని 'ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ (ఐవోఎం)'కు ఎంపిక చేశారు. » అమెరికాలోని మూడు జాతీయ అకాడమీలు ఐవోఎం, నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజినీరింగ్కు ఎన్నికైనవారు అమెరికాలో ప్రస్తుతం 16 మంది ఉండగా వారిలో సురేష్ ఒకరు.
|
అక్టోబరు - 18
|
¤ శబరిమల అయ్యప్ప దేవాలయ మేల్సంతి (ప్రధాన పూజారి)గా ఇ.ఎన్.కృష్ణదాస్ నంబూద్రిని నియమించారు. » మాలికాపురం దేవి ఆలయ మేల్సంతిగా ఎస్.కేశవన్ ఎంపికయ్యారు. ఈ ఇద్దరు ఏడాది పాటు సేవలందిస్తారు. |
అక్టోబరు - 19
|
¤ ప్రపంచంలో అత్యుత్తమ పనితీరును కనబరిచిన కంపెనీ సీఈఓల్లో మాస్టర్ కార్డ్ చీఫ్ అజయ్ బంగా చోటు దక్కించుకున్నారు. » ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ బిజినెస్ రివ్యూ (హెచ్బీఆర్) మ్యాగజైన్ రూపొందించిన 2014 టాప్-100 ప్రపంచ సీఈఓల్లో బంగా 64వ స్థానంలో నిలిచారు. » భారత్లో జన్మించిన సీఈఓల్లో బంగా ఒక్కరికే ఈ జాబితాలో ర్యాంక్ లభించింది. » ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సీఈఓ జెఫ్రీ బెజోస్ అగ్రస్థానంలో నిలిచారు. తర్వాతి స్థానాల్లో గిలీడ్ సైన్సెస్ సీఈఓ డీన్ మార్టిన్, సిస్కో సిస్టమ్స్ సీఈఓ జాన్ చాంబర్స్లు నిలిచారు. » టాప్-100లో ఇద్దరు మహిళలు వెంటాస్ సీఈఓ డెబ్రా కఫారో (27), టీజేఎక్స్ చీఫ్ కరోల్ మేరో విట్జ్ (51)కు మాత్రమే చోటు దక్కింది. ¤ భారత్కు చెందిన అయిదేళ్ల 11 నెలల హర్షిత్ సౌమిత్రా 5,554 మీటర్ల ఎత్తున్న కాలాపత్తర్ శిఖరాన్ని అధిరోహించి రికార్డ్ సృష్టించాడు. పర్వతారోహకుడైన తన తండ్రి రాజీవ్ సౌమిత్రాతోపాటు ఇద్దరు షెర్పాల సాయంతో పది రోజుల్లో ఈ శిఖరాన్ని అధిరోహించాడు. దీంతో ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్ కంటే 200 మీటర్ల ఎత్తుకు హర్షిత్ ఎక్కినట్లయింది. » ఈ సాహసంతో హర్షిత్ ఏడేళ్ల ఆర్యన్ బాలాజీ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు.
|
అక్టోబరు - 20
|
¤ 'డీఎస్సీ' దక్షిణాసియా సాహితీ పురస్కారానికి పోటీ పడుతున్న 10 మంది రచయితల్లో నలుగురు భారతీయులు ఉన్నారు. వీరిలో మీనా కందసామి (ద జిప్సీ గాడెస్ అనే రచన), రుక్మిణి భయా నాయర్ (మ్యాడ్ గర్ల్స్ లవ్ సాంగ్), షంసూర్ రెహ్మాన్ ఫరూఖి (ది మిర్రర్ ఆఫ్ బ్యూటీ), జస్ప్రీత్ సింగ్ (హీలియం) ఉన్నారు. » 50 వేల డాలర్ల ఈ పురస్కారాన్ని దక్షిణాసియాపై వెలువడే సాహిత్యానికి ఏటా అందిస్తారు. ఈసారి మొత్తం 75 ప్రతిపాదనలు రాగా, అందులో 10 రచనలను ఒక జాబితాగా తయారు చేశారు. » తుది జాబితాను నవంబరు 27న లండన్లో విడుదల చేస్తారు. జనవరిలో జరిగే జైపూర్ సాహితీ ఉత్సవంలో విజేతను ప్రకటిస్తారు. » పురస్కారానికి పోటీపడుతున్నవారిలో ప్రముఖ నవలా రచయితలు ఖలీద్ హోస్నీ (అండ్ ది మౌంటైన్స్ ఎకోడ్), ఝంపా లాహిరి (ది లో ల్యాండ్) కూడా ఉన్నారు.
|
అక్టోబరు - 22
|
¤ సూరత్ వజ్రాల వ్యాపారి సాల్జీభాయ్ ఢోలకియా తన వద్ద పనిచేసే 1200 మంది ఉద్యోగులకు రెండు పడక గదుల ఇళ్లను, ఆభరణాలను, కార్లను దీపావళికి కానుకలుగా ఇచ్చి దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించారు.
¤ పాకిస్థాన్ సాహస బాలిక, నోబెల్ శాంతి బహుమతి విజేత మలాలా యూసఫ్ జాయ్ అమెరికా 'స్వేచ్ఛ పతకం' (లిబర్టీ మెడల్)ను గెలుచుకుంది. ఈ పతకాన్ని గెలుచుకున్న అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది. ఫిలిడెల్ఫియాలో ఈ పతకాన్ని అందుకుంది. » ఇప్పటివరకు ఈ పతకాన్ని అందుకున్నవారిలో హిల్లరీ క్లింటన్, టోనీ బ్లెయిర్, జార్జ్ హెచ్.డబ్ల్యు.బుష్, బిల్ క్లింటన్, కోఫీ అన్నన్, హమీద్ కర్జాయ్ తదితరులు ఉన్నారు. ¤ భారత సంతతికి చెందిన అనితా ఎం.సింగ్ను అమెరికా న్యాయశాఖలోని కీలకమైన జాతీయ భద్రతా విభాగానికి (ఎన్ఎస్డీ) సారథిగా నియమించారు. అంతకుముందు ఆమె శ్వేత సౌధంలో పనిచేశారు. |
అక్టోబరు - 25
|
¤ 'ఆసియా అగ్రశ్రేణి పది టెక్నాలజీ కుబేరుల్లో' ముగ్గురు భారతీయులకు స్థానం దక్కింది. » విప్రో అధిపతి అజీమ్ ప్రేమ్జీ 1600 కోట్ల డాలర్ల సంపదతో మూడో స్థానంలో నిలిచారు. » 1295 కోట్ల డాలర్లతో సింగపూర్ ఇన్నోవేషన్ లీగ్ అధినేత నీరజ్ గోయల్(45) ఆరో స్థానంలో ఉన్నారు. జాబితాలో పిన్న వయస్కుడు నీరజ్. » హెచ్సీఎల్ టెక్నాలజీస్కు చెందిన శివ్నాడార్ 1170 కోట్ల డాలర్లతో ఏడో స్థానంలో ఉన్నారు.
¤ అంతర్జాతీయ సెర్చింజిన్ దిగ్గజం గూగుల్ ఆండ్రాయిడ్ యూనిట్కు అధిపతిగా ఉన్న భారతీయుడు సుందర్ పిచ్చయ్కు కంపెనీ మరిన్ని కీలక బాధ్యతలను అప్పగించింది. » గూగుల్కు సంబంధించి రిసెర్చ్, సెర్చ్, మ్యాప్లు, గూగుల్ ప్లస్, కామర్స్, ప్రకటనలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగాలను పర్యవేక్షిస్తున్న గూగుల్ సీఈఓ లారీ పేజ్ ఈ బాధ్యతలను సుందర్ పిచ్చయ్కు బదిలీ చేశారు. ఇప్పుడు నిర్వహిస్తున్న ఆండ్రాయిడ్, క్రోమ్, గూగుల్ యాప్స్ బాధ్యతలను కూడా సుందర్ పిచ్చయ్ కొనసాగిస్తారు. ¤ నేలకు దాదాపు 41 వేల అడుగుల ఎత్తులో స్ట్రాటో ఆవరణం నుంచి దూకడం ద్వారా గూగుల్ సంస్థకు చెందిన 'సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ నాలెడ్జ్' అలన్ యూస్టేస్ (57) కొత్త రికార్డు సృష్టించాడు. » స్ట్రాటో స్పియరిక్ ఎక్స్ప్లోరర్ ప్రాజెక్టులో భాగంగా దీన్ని నిర్వహించారు. ఆ ప్రాంతంలో మానవసహిత అన్వేషణలకు వీలు కల్పించాలనేది ఈ ప్రాజెక్టు ఉద్దేశం. » లోగడ ఆస్ట్రియా స్కై డైవర్ ఫెలిక్స్ బామ్ గార్ట్నర్ 2012లో 38,969 అడుగుల ఎత్తు నుంచి దూకాడు. |
అక్టోబరు - 26
|
¤ ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ), యునెస్కో, ఐక్యరాజ్యసమితి పర్యావరణ సంస్థ కూటమి సుస్థిర అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ పరిశోధన మండలి వేదికకు మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్ నేతృత్వం వహించేందుకు ఎంపికయ్యారు. » 'ఫ్యూచర్ ఎర్త్ ఎంగేజ్మెంట్ కమిటీ' పేరిట ఏర్పాటు చేస్తున్న ఈ వేదిక ప్రపంచ సుస్థిర అభివృద్ధికి అవసరమైన చర్యలను వేగవంతం చేయడానికి సలహాలను అందించనుంది. పర్యావరణ మార్పులు, సవాళ్లు తదితర అంశాలపై వ్యూహాత్మక సూచనలు చేయనుంది. » ఈ కమిటీలో మొత్తం 18 మంది సభ్యులుంటారు. ¤ బ్రిటన్కు చెందిన సైమన్ ప్లాంట్ 14 కార్లను తాడుతో 18 అడుగుల రెండు అంగుళాల దూరం లాగి ప్రపంచ రికార్డు సృష్టించాడు. |
అక్టోబరు - 27
|
¤ హైదరాబాద్లోని కిమ్స్ - ఉషాలక్ష్మి రొమ్ము క్యాన్సర్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ రఘురామ్కు ప్రపంచంలోనే అతి పెద్దదైన శస్త్ర చికిత్స కళాశాల శాన్ఫ్రాన్సిస్కోలోని అమెరికన్ కాలేజీ ఆఫ్ సర్జన్స్లో ఉన్నతస్థాయి ఫెలోషిప్ లభించింది. » ఈ కళాశాల వందో వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయనకు ఈ ఫెలోషిప్ను అందజేశారు. » వివిధ దేశాల నుంచి సుమారు 80 వేల మంది శస్త్ర చికిత్స నిపుణులు ఈ కళాశాలలో సభ్యులవడం, ప్రపంచంలోనే అతిపెద్ద శస్త్ర చికిత్స నిపుణుల సదస్సు ఇదే కావడం విశేషం.
¤ దక్షిణాఫ్రికా ఫుట్బాల్ జట్టు కెప్టెన్, గోల్కీపర్ సెంజో మియివా జోహనెస్బర్గ్లో హత్యకు గురయ్యాడు. » తన స్నేహితురాలిని దొంగల నుంచి కాపాడే ప్రయత్నంలో అతడు ప్రాణాలు కోల్పోయాడు. |
అక్టోబరు - 29
|
| ¤ సచిన్ టెండుల్కర్, ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం స్టీవ్ వాకు బ్రాడ్మన్ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కింది. |
|
|