నవంబరు - 1
|
¤ తమిళనాడులోని శ్రీ పెరంబుదూరులో 2006 జనవరిలో ఏర్పాటు చేసిన నోకియా కంపెనీని మూసివేశారు. ఈ యూనిట్ కార్యకలాపాలను నవంబరు 1 నుంచి నిలిపివేస్తున్నట్లు ఇప్పటికే ఈ సంస్థ ప్రకటించింది.
|
నవంబరు - 2
|
¤ ప్రధాని నరేంద్ర మోదీ ఆకాశవాణిలో 'మన్కీ బాత్' కార్యక్రమం ద్వారా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. 20 నిమిషాలపాటు సాగిన ఈ ప్రసంగంలో నల్లధనంతోపాటు వికలాంగులైన చిన్నారుల కోసం చేపడుతున్న చర్యలు, స్వచ్ఛభారత్, మాదక ద్రవ్యాలు, పరిపాలనలో ప్రజలకు భాగస్వామ్యం లాంటి అంశాలను స్పృశించారు.¤ బహిరంగ మల విసర్జనకు అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈల పాటతో ఆ వ్యక్తి సిగ్గుపడేలా చేసి మళ్లీ అలాంటి చర్యకు పాల్పడకుండా నివారించాలని నిర్ణయించింది. » ఇందుకోసం ముందుగా 5, 6 తరగతుల విద్యార్థులకు పరిశుభ్రత కార్యక్రమాలపై అవగాహన కల్పించి వారిలో చైతన్యం తీసుకువచ్చి 'ఈలపాట' లో భాగస్వాములు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.¤ దేశంలో హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా దిల్లీ - చెన్నై రైలు మార్గంపై అధ్యయనం మొదలైంది. ఏడాది లోపు ఇది పూర్తవుతుంది. » 2182 కి.మీ. పొడవున్న ఈ మార్గంలో ప్రయాణానికి రాజధాని ఎక్స్ప్రెస్కు 28 గంటల సమయం పడుతోంది. హైస్పీడ్ రైళ్లు వస్తే కేవలం ఏడు గంటలు సరిపోతుంది. » సాధారణ రైలు మార్గం నిర్మించడానికి కి.మీ. కు రూ.5 కోట్లు కావాలి. హైస్పీడ్ రైళ్లకు రూ.120 - 126 కోట్లు వరకు అవసరమవుతుంది.¤ దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక నగరం వారణాసిని స్మార్ట్ హెరిటేజ్ సిటీగా మార్చేందుకు రూ.11,800 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. » దేశంలోని వంద నగరాలను 2019 నాటికి స్మార్ట్ సిటీలుగా మార్చాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. » ఇందులో భాగంగా తొలివిడతలో మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి పార్లమెంట్ నియోజక వర్గాన్ని విదేశాల సహకారంలో స్మార్ట్సిటీగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. » రూ.2,082 కోట్లను కేంద్ర ప్రభుత్వం, రూ.1,488 కోట్లను యూపీ ప్రభుత్వం భరిస్తాయి. మిగిలిన రూ.8,230 కోట్లను ప్రైవేటు, విదేశీ సంస్థలు భరిస్తాయి.¤ సీఆర్పీఎఫ్ వజ్రోత్సవ కార్యక్రమాలను న్యూదిల్లీలో ఘనంగా నిర్వహించారు.
|
నవంబరు - 3
|
¤ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిపాదించిన 'మేకిన్ ఇండియా' కార్యక్రమానికి సహకరించడం ద్వారా అధిక ఉద్యోగాల కల్పన కోసం అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ)తో సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి సంస్థల (ఎంఎస్ఎంఈ) మంత్రిత్వ శాఖ ఒక ఒప్పందం చేసుకుంది. » సంస్థ సొంతంగా పరిశ్రమను ఏర్పాటు చేసేలా ప్రోత్సహించడం, ఉత్పాదకత పెంచడంతోపాటు అంతర్జాతీయ అవసరాలకు అనుగుణంగా సరఫరాలు ఉండేలా పని స్థలంలో మెరుగైన విధానాలను అవలంభించడం ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశం. ¤ కాలం చెల్లిన 73 శాసనాలను రద్దు చేయాలంటూ లా కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. » లా కమిషన్ తాజాగా కేంద్ర న్యాయశాఖకు సమర్పించిన మూడో మధ్యంతర నివేదికలో ఈ 73 చట్టాల రద్దుకు సిఫార్సు చేసింది. » బ్రిటిష్ సామ్రాజ్యం చేసే యుద్ధాల్లో పాల్గొనవద్దని భారత ప్రజలకు చెప్పేవారికి శిక్షను నిర్దేశిస్తూ రెండో ప్రపంచ యుద్ధానికి ముందు బ్రిటిష్ ప్రభుత్వం 'క్రిమినల్ లా (సవరణా) చట్టం - 1936' ని తీసుకొచ్చింది. తాజాగా లా కమిషన్ రద్దుకు సిఫార్సు చేసిన 73 శాసనాల్లో ఇది కూడా ఉంది. » తాజా జాబితాతో కలిపి రద్దుకు లా కమిషన్ సిఫార్సు చేసిన శాసనాల సంఖ్య 258 కి చేరింది. లా కమిషన్ సెప్టంబరులో సమర్పించిన తొలి మధ్యంతర నివేదికలో 72 చట్టాల రద్దుకు, తర్వాత ఇచ్చిన రెండో మధ్యంతర నివేదికలో 113 చట్టాల రద్దుకు సిఫార్సు చేసింది. ¤ సమాచార హక్కు (సహ) చట్టం కింద సమాచారాన్ని 'ఎలక్ట్రానిక్' పద్ధతిలో అందజేసే అంశంపై ఒక నిర్ణయం తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. » మధ్యప్రదేశ్కు చెందిన రాజీవ్ అగర్వాల్ అనే న్యాయవాది వ్యక్తిగతంగా దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు ఈ మేరకు పేర్కొంది. » కేంద్ర ముఖ్య సమాచార కమిషనర్ (సీఐసీ) నియామకం కోసం ఏర్పాటైన ఎంపిక సంఘంలో లోక్సభలో కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గేకు స్థానం లభించింది. » ప్రధాని నరేంద్ర మోదీ ఈ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నారు. రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ దీనిలో ఒక సభ్యుడు కాగా ఖర్గే రెండో వ్యక్తి. » లోక్సభలో ప్రతిపక్ష నేత హోదాపై స్పష్టత లేని నేపథ్యంలో న్యాయమంత్రిత్వ శాఖ సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ¤ ప్రధాని, ఆయన నియమించే ఒక కేంద్ర మంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నేత ఈ ముగ్గురూ కలిసి సీఐసీని ఎంపిక చేయాలని సహ చట్టం చెబుతోంది. లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఎవరినీ గుర్తించనప్పుడు ఏకైక పెద్ద కూటమి నేతను ప్రతిపక్ష నేతగా భావించవచ్చని సహ చట్టం చెబుతోంది. ఆ ప్రకారం ఖర్గేను పరిగణనలోకి తీసుకున్నారు. ¤ అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ)లో సమూల మార్పులు చేయాలని యోచిస్తున్న కేంద్ర ప్రభుత్వం అందుకోసం ఒక సమీక్షా కమిటీని ఏర్పాటు చేసింది. » సాంకేతిక విద్య విస్తృతి, సంక్లిష్టతలు పెరుగుతున్న నేపథ్యంలో ఆ సవాళ్లను ఎదుర్కొనే దిశగా తీసుకోవాల్సిన చర్యలను ఆ కమిటీ సూచిస్తుంది. ఏఐసీటీఈ పనితీరును సమీక్షించడంతోపాటు ఏఐసీటీఈ చట్టంలో అవసరమైన సవరణలను కూడా ఈ కమిటీ సూచిస్తుంది » కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి ఎం.కె. కా నేతృత్వంలోని నలుగురు సభ్యుల కమిటీ ఆరునెలల్లో నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది.
|
నవంబరు - 4
|
¤ దిల్లీ శాసనసభ రద్దుకు కేంద్ర మంత్రివర్గం రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్జంగ్ సిఫార్సు మేరకు కేంద్ర మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది. » దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఫిబ్రవరి 14న రాజీనామా చేయడంతో ఫిబ్రవరి 17 నుంచి రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచారు.
|
నవంబరు - 5
|
¤ సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద అక్టోబరు 31 నాటికి కేంద్ర సమాచార కమిషన్ వద్ద 24,150 కేసులు పెండింగ్లో ఉన్నట్లు తేలింది. సహచట్టం కార్యకర్త వెంకటేష్ దరఖాస్తు మేరకు ఈ విషయం వెల్లడైంది.¤ నాలుగు రాష్ట్రాల్లో మూతపడే స్థితిలో ఉన్న 23 జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల (డీసీసీబీ)కు జవసత్వాలు కల్పించేందుకు రూ. 2375.42 కోట్ల మూలధనం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పశ్చిమ బంగలో ఒకటి, జమ్మూకాశ్మీర్, మహారాష్ట్రల్లో మూడు, ఉత్తరప్రదేశ్లో 16 లైసెన్సు లేని డీసీసీబీలు ఉన్నాయి.¤ యూపీఏ ప్రభుత్వం రాజ్యసభలో ఫిబ్రవరి 19న ప్రవేశపెట్టిన ఆహార రక్షణ, ప్రమాణాల (సవరణ) బిల్లు-2014 ను ప్రభుత్వం ఉపసంహరించుకునేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.¤ భారత పునర్వినియోగ ఇంధన అభివృద్ధి సంస్థ (ఐఆర్ఈడీఏ)లో రూ.వెయ్యి కోట్లుగా ఉన్న అధీకృత మూలధనాన్ని రూ.6 వేల కోట్లకు పెంచేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అధీకృత మూలధనం ఎక్కువగా ఉంటే, మార్కెట్ నుంచి పెద్ద మొత్తంలో రుణం పొందొచ్చు.¤ ఇతర దేశాలను సంప్రదించకుండానే భారత నౌకలు అంతార్జాతీయ నౌకా రవాణా కార్యకలాపాల్లో పాలుపంచుకునేందుకు వీలు కల్పించే అంతర్జాతీయ ఒప్పందాన్ని కేబినెట్ ఆమోదించింది. ఈ విషయంపై వాణిజ్య నౌకా రవాణా (సవరణ) బిల్లు - 2013కు ప్రతిపాదించిన మార్పులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.¤ భారత్, నైజీరియా మధ్య ఖైదీల బదలాయింపునకు ఉద్దేశించిన ఒప్పందంపై సంతకం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ రెండు దేశాల జైళ్లలో ఉన్న ఖైదీలు వారి శిక్షా కాలంలో మిగిలిన కాలాన్ని సొంత దేశంలో అనుభవించేందుకు ఈ ఒప్పందం వీలు కల్పిస్తోంది. భారత్ ఇప్పటి వరకు బ్రిటన్, మారిషెస్, బ్రెజిల్, బంగ్లాదేశ్, ఫ్రాన్స్, సౌదీ అరేబియా, ఇరాన్, కువైట్, శ్రీలంక, యూఏఈ, మాల్దీవులు, రష్యా తదితర దేశాలతో ఇలాంటి ఒప్పందాలు చేసుకుంది.¤ దేశ రాజధాని దిల్లీలో శాసనసభ ఎన్నికలకు మార్గం సుగమం చేస్తూ రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ అసెంబ్లీని రద్దు చేశారు. కేంద్ర కేబినెట్ నిర్ణయానికి రాష్ట్రపతి అంగీకారం తెలుపుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు.¤ ఉత్తరప్రదేశ్లో 'సమాజ్ వాదీ పింఛను' పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ లక్నోలో ప్రారంభించారు. » ఈ పథకం ద్వారా దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న 40 లక్షల కుటుంబాలకు నెలవారీ ఆర్థిక సాయం అందుతుంది. » నెలకు రూ.500 చొప్పున పింఛన్ నేరుగా లబ్ధిదారు ఖాతాలో చేరుతుంది. పింఛను కార్డుదారుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సదుపాయం కూడా కల్పిస్తారు.¤ ప్రధాని నరేంద్రమోదీ తన నేతృత్వంలోని ఉన్నతస్థాయి 'వాతావరణ మార్పుల మండలి'ని పునర్వ్యవస్థీకరించారు.
|
నవంబరు - 6
|
¤ గ్రామీణ యువతలో నైపుణ్యాభివృద్ధికి ఉద్దేశించిన 'దీన్దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన' పథకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. » గ్రామీణ యువతకు అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. » అంతర్జాతీయంగా 5.30 కోట్ల మంది నర్సులు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు లాంటి నిపుణులైన కార్మికుల అవసరం ఉందని, భారత్లో అంతర్జాతీయ అవసరాలను తీర్చగల 4.70 కోట్ల మంది యువత అందుబాటులో ఉన్నారని కేంద్రం లెక్క తేల్చింది. » 15 ఏళ్లు నిండిన గ్రామీణ యువత ఈ పథకానికి అర్హులని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ ప్రకటించింది.¤ వివిధ సంక్షేమ పథకాల అమలుకు పింఛనుదారుల సేవలను వినియోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ (డీపీపీడబ్ల్యూ) 'సంకల్ప్' అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. » సంకల్ప్ కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు పింఛనుదారులు www.pensionersportal.gov.in/sankalp/ వెబ్సైట్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలి.
|
నవంబరు - 7
|
| ¤ పొగాకు, వాటి ఉత్పత్తులపై నిషేధం విధిస్తున్నట్లు బీహార్ ప్రభుత్వం ప్రకటించింది. జర్దా, పాన్ మసాలా సహా ఇతర పొగాకు ఉత్పత్తులపై ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంజీ నిషేధం విధించారు. » ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వ ఆదేశించింది. |
నవంబరు - 8
|
¤ ఉత్తరాఖండ్ పర్వత ప్రాంతాల్లో పురోహితుల వలసలను నిరోధించేందుకు వారికి నెలకు రూ.800 చొప్పున పింఛన్ ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ¤ గోవా నూతన ముఖ్యమంత్రిగా లక్ష్మీకాంత్ పర్సేకర్(58) ప్రమాణ స్వీకారం చేశారు. పర్సేకర్తోపాటు 9 మంది మంత్రులతో ఆ రాష్ట్ర గవర్నర్ మృదులా సిన్హా రాజధాని పనాజీలో ప్రమాణం చేయించారు. » కేంద్ర మంత్రివర్గంలో చేరనున్న మనోహర్ పారికర్ స్థానంలో మాండ్రెమ్ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పర్సేకర్ బాధ్యతలు చేపట్టారు.
|
నవంబరు - 9
|
¤ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లు తప్పనిసరిగా ఓటేయాలంటూ గుజరాత్ ప్రభుత్వంప్రతిపాదించిన బిల్లును ఆ రాష్ట్ర గవర్నర్ ఓపీ కోహ్లీ ఆమోదించారు. » దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటింగ్ను తప్పనిసరి చేసిన తొలి రాష్ట్రంగా గుజరాత్ ప్రత్యేకతను సాధించింది. » స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటెయ్యనివారికి శిక్ష తప్పదని ఈ బిల్లు స్పష్టంగా పేర్కొంటుంది.¤ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మంత్రి వర్గాన్ని విస్తరించి, పునర్వ్యవస్థీకరించారు. » న్యూదిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో 21 మంది కొత్త మంత్రులతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రమాణ స్వీకారం చేయించారు. విస్తరణలో నలుగురికి కేబినెట్ హోదా కల్పించారు. ముగ్గురిని స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సహాయ మంత్రులుగా నియమించారు. మిగతా 14 మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. » ఈ ఏడాది మేలో ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మంత్రి వర్గాన్ని విస్తరించడం ఇదే తొలిసారి. » ఇప్పటివరకు 45 మంది మంత్రులు ఉండగా, తాజా విస్తరణలో ఆ సంఖ్య 66కి చేరింది. వీరిలో ప్రధాని సహా 27 మంది కేబినెట్ హోదాలో ఉన్నారు. 13మంది సహాయ మంత్రులకు స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. మిగిలిన 26 మంది సహాయ మంత్రులు. » ఉత్రరప్రదేశ్లోని ఫతేపూర్ నియోజకవర్గానికి చెందిన ఎంపీ సాధ్వీ నిరంజన్ జ్యోతి(47)కి సహాయమంత్రిగా చోటు కల్పించడంతో మోదీ కేబినెట్లో మహిళా మంత్రుల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. » తాజా విస్తరణలో ఉత్తరప్రదేశ్ నుంచి నలుగురికి మంత్రివర్గంలో చోటు దక్కడంతో, ఈ రాష్ట్రం నుంచి అత్యధికంగా 13 మంది మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లయింది. » 2004లో ఏథేన్స్ ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో భారత్కు రజత పతకాన్ని అందించిన రాజ్యవర్థన్సింగ్ రాఠోడ్ను మంత్రి పదవి వరించింది. కల్నల్గా సైన్యం నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి భాజపాలో చేరిన రాఠోడ్ జైపూర్ గ్రామీణ నియోజకవర్గం నుంచి తొలిసారి లోక్సభకు ఎన్నికయ్యారు. ప్రతిష్ఠాత్మక జాతీయ రక్షణ అకాడమీ(ఎన్డీఏ) లో శిక్షణ పొందిన ఆయన 23 ఏళ్ల పాటు సైన్యంలో పని చేశారు. 2004 సీడ్నీ, 2006 కైరోలో జరిగిన ప్రపంచ షూటింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో; 2006 మెల్బోర్న్లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణాన్ని దక్కించుకున్నారు. » రాజకీయ నేతగా మారిన గాయకుడు బాబుల్ సుప్రియో కూడా తొలిసారి లోక్సభకు ఎంపికై మంత్రివర్గంలో చోటు పొందారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో భాజపాకు ఉన్న ఇద్దరు ఎంపీల్లో సుప్రియో ఒకరు.
కేంద్రమంత్రి వర్గం.... సమగ్ర స్వరూపం
|
» ప్రధాని నరేంద్రమోదీ: సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, ఫించన్లు, అణుశక్తి విభాగం, అంతరిక్ష విభాగం, మంత్రులకు కేటాయించని ఇతర అన్ని శాఖలు.
|
నవంబరు - 10
|
¤ కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు విమానయాన ముసాయిదా విధానాన్ని దిల్లీలో విడుదల చేశారు. » ప్రాంతీయ కనెక్టివిటీ, హైదరాబాద్ సహ ఆరు ప్రధాన మెట్రో ఎయిర్పోర్టులను అంతర్జాతీయ హబ్లుగా తీర్చిదిద్దడం, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)లో మరిన్ని విమానాశ్రయాలను నిర్మించడం, విమాన ఇంధన ధరలను హేతుబద్ధీకరించడం, వాయు రవాణాను ప్రోత్సహించడం, విమానాల నిర్వహణ, మరమ్మతు సేవలు, హెలికాప్టర్ కార్యకలాపాలు, ప్రయాణికుల సౌకర్యాలు మెరుగుపరచడం లాంటివి ముసాయిదా విధానంలో ఉన్నాయి. » ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ), పవన్ హన్స్ హెలికాప్టర్ (పీహెచ్హెచ్ఎల్) లను స్టాక్ ఎక్స్ఛేంజ్లో నమోదు చేయడం, ఎయిర్ ఇండియా కార్యకలాపాలను వేగిరం చేయడం తదితరాలను కూడా కొత్త ముసాయిదా విధానంలో ప్రభుత్వం ప్రతిపాదించింది.¤ భారత పశుసంవర్థక మండలి (వీసీఐ)ని కేంద్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది.¤ అత్యాధునిక ఈ రిక్షా ను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ దిల్లీలో ప్రారంభించారు. » 2 వేల వాట్ల సామర్థ్యంతో గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ కొత్త వాహనాలు పూర్తిగా పర్యావరణ హితమైనవి. » ఆధునిక యుగంలోనూ మనుషులు రిక్షాలను లాగే పరిస్థితిని నివారించేందుకు బ్యాటరీ సాయంతో నడిచే ఈ రిక్షాలను ప్రవేశపెట్టినట్లు మంత్రి ప్రకటించారు.¤ దేశ పరిశుభ్రత కోసం రూపొందించిన 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంపై ఛత్తీస్గఢ్లో తయారుచేసిన 36 వేల చదరపు అడుగుల అతిపెద్ద బ్యానర్ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ఆవిష్కరించారు. » బ్యానర్పై కొన్ని వందల నినాదాలు రాశారు. దేశ ప్రధానులందరి చిత్రాలకు చోటు కల్పించారు. 180 అడుగుల వెడల్పు, 200 అడుగుల ఎత్తులో దీన్ని రూపొందించారు. ఈ బ్యానర్ ప్రపంచంలోనే పెద్దదని నిర్వాహకులు ప్రకటించారు.¤ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిల్లీలో 'జీవన్ ప్రమాణ్' అనే కొత్త పథకాన్ని ప్రారంభించారు. » ఈ పథకం ప్రకారం పదవీ విరమణ చేసి పెన్షన్ పొందుతున్న ప్రభుత్వ, ప్రభుత్వరంగ ఉద్యోగులు పెన్షన్ కొనసాగింపు కోసం ప్రతీ నవంబరులో తాము జీవించే ఉన్నామని ధ్రువీకరించే లైఫ్ సర్టిఫికెట్ను సంబంధిత అధికారులకు అందించాల్సిన అవసరం లేదు అలాగే స్వయంగా అధికారుల ముందు హాజరు కావాల్సిన అవసరం కూడా లేదు. » పెన్షన్ పొందుతున్న ఉద్యోగి మొదట తన స్మార్ట్ఫోన్/కంప్యూటర్ లో తన ఆధార్ నంబర్, వేలిముద్రలు, కనుపాపలు మొదలైన బయోమెట్రిక్ వివరాలను రికార్డు చేయాల్సి ఉంటుంది. దాని ప్రకారం ఆ పెన్షనర్ పూర్తి వివరాలను సెంట్రల్ డేటాబేస్లో నిక్షిప్తం చేస్తారు. అవసరమైనప్పుడు తన దగ్గరున్న బయోమెట్రిక్ యంత్రంపై తన బయోమెట్రిక్ వివరాలను ఆ రిటైర్డ్ ఉద్యోగి నమోదు చేసినప్పుడు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ను పెన్షన్ పంపిణీ చేసే సంస్థ పొందగలుగుతుంది. పెన్షన్ను కొనసాగిస్తుంది దీని వల్ల వృద్ధులైన పెన్షనర్లు ఇంటి దగ్గరి నుంచే పెన్షన్ కొనసాగింపు సదుపాయాన్ని పొందవచ్చని ప్రభుత్వం వెల్లడించింది.¤ ప్రాచీన వైద్య విధానాలకు పెద్దపీట వేసే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర కేబినెట్లో 'ఆయుష్'కు విడిగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. » తాజాగా మంత్రి వర్గాన్ని పునర్ వ్యవస్థీకరించిన మోదీ ఆయుష్ శాఖను సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) శ్రీపాద యశో నాయక్కు కేటాయించారు. » ఆయుర్వేదం, యోగా, నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి వీటన్నింటినీ కలిపి 'ఆయుష్' గా వ్యవహరిస్తారు. గతంలో ఆరోగ్య మంత్రిత్వి శాఖలో ఇది ఉండేది.
|
నవంబరు - 11
|
¤ కుటుంబ నియంత్రణ (కు.ని.) శస్త్ర చికిత్సలు వికటించడంతో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బిలాస్పూర్ జిల్లాలోని పెండారి గ్రామంలో 11 మంది మహిళలు మరణించారు.¤ దేశ సాంస్కృతిక, సామాజిక వారసత్వాన్ని, రక్షణ బలాన్ని ప్రతిబింబించేలా దిల్లీలో రాజ్పథ్పై జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల పరేడ్లో శకటాన్ని ప్రదర్శించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవకాశం లభించింది. » శకటాలను ప్రదర్శించేందుకు దేశంలోని 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల నుంచి మొత్తం 50 దరఖాస్తులు రాగా వాటిలో 13 దరఖాస్తులకు రక్షణశాఖ ఆధ్వర్యంలోని గణతంత్ర వేడుకల కమిటీ ఆమోదం తెలిపింది. అందులో ఆంధ్రప్రదేశ్ ఒకటి. » 2015 జనవరి 26వ తేదీన జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు అంశాలతో కమిటీ ముందుకు వెళ్లింది. అభివృద్ధి, మౌలిక సదుపాయాల విషయంలో 'సూర్యుడు ఉదయించే రాష్ట్రం' నినాదంతోనూ, సంస్కృతి, సంప్రదాయాల విషయంలో 'సంక్రాంతి - ఆంధ్రుల సంస్కృతి......రీతి, రివాజు' నినాదంతోనూ, విశిష్టమైన నాట్యరీతి 'కూచిపూడి' నినాదంతో దరఖాస్తు చేసుకుంది. ఇందులో 'సంక్రాంతి'కి కేంద్ర కమిటీ ఆమోదం తెలిపింది. » గణతంత్ర వేడుకల్లో రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే అవకాశం తెలంగాణకు దక్కలేదు. నమూనా స్థాయిలోనే తెలంగాణ దరఖాస్తును గణతంత్ర వేడుకల కమిటీ తిరస్కరించింది. తెలంగాణ నుంచి బతుకమ్మ, బోనాలు, గోల్కొండ కోటలను ప్రదర్శించేందుకు దరఖాస్తు పంపగా అందులో తొలుత బతుకమ్మను ఎంపిక చేసినప్పటికీ, డిజైన్ నిబంధనాలకు అనుగుణంగా లేదని దీన్ని కూడా కమిటీ తిరస్కరించింది.¤ నిర్బంధ ఓటింగ్పై ఇటీవలే బిల్లు తెచ్చిన గుజరాత్ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంట్లో మరుగుదొడ్లు తప్పనిసరని, లేని వారు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులని స్పష్టం చేసింది. ఈ తీర్మానాన్ని గుజరాత్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. » వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుందని ప్రభుత్వం ప్రకటించింది.
|
నవంబరు - 12
|
¤ ఏఐడీఎంకే అధినేత జయలలిత పదేళ్ల పాటు ఎన్నికల్లో పాల్గొనడానికి అనర్హురాలని తమిళనాడు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ లో వెల్లడించింది. » తమిళనాడు అసెంబ్లీ సభ్యురాలైన జయలలితకు ఆదాయానికి మించి ఆస్తుల కేసులో 2014, సెప్టెంబరు 27వ తేదీన శిక్ష పడినప్పటి నుంచి, అనర్హత వర్తిస్తుందని తెలిపింది. » జయలలిత ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీరంగం అసెంబ్లీ స్థానాన్ని ఖాళీ అయినట్లుగా పరిగణిస్తామని తెలిపింది.¤ రైళ్లను శుభ్రం చేయడంతోపాటు రైలు బోగీల్లో బయో మరుగు దొడ్లు, ఆధునిక యంత్రాలతో దుస్తులను శుభ్రం చేసే లాండ్రీల్లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ), ప్రైవేటు పెట్టుబడులను 17 విభాగాల్లో అనుమతించాలని రైల్వే నిర్ణయించింది.¤ బీహార్ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీ అగ్రవర్ణాల ప్రజలంతా విదేశీయులేనని, వారు ఆర్యవంశానికి వారసులని.. కేవలం దళితులు, గిరిజనులే దేశీయ ప్రజలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.¤ మహారాష్ట్ర శాసనసభలో నిర్వహించిన బలపరీక్షలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్ (భాజపా) ప్రభుత్వం మూజువాణి ఓటుతో విశ్వాస పరీక్షలో నెగ్గిందని సభాపతి హరిబాబు బాగ్దే ప్రకటించారు. » ఎన్సీపీ (నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ) మద్దతు తెలపడంతో భాజపా నెగ్గింది.¤ భారత్కు తక్కువ పన్నులున్న అనేక దేశాలతో 'నేర న్యాయపరమైన ఒప్పందాలు' లేకపోవడంతో అక్కడ ఉన్న భారతీయుల నల్లధనం వెలికతీతలో అవరోధాలు ఎదురవుతున్నాయని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. » ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) లో ఉన్న కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ), సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈ మేరకు ఒక నివేదికను సిట్కు సమర్పించాయి. » భారత్కు 'పరస్పర న్యాయ సహాయ ఒప్పందాలు' (ఎంఎల్ఏటీ) 37 దేశాలతోనే ఉన్నాయి. తక్కువ పన్నులున్న కేమెన్ ఐలాండ్స్, బెర్ముడా, మొనాకో, మాల్టా లాంటి అనేక దేశాలు ఈ జాబితాలో లేవు. ఈ దేశాల నుంచి నల్లధనం నిల్వలను వెనక్కి తెప్పించాలంటే ఇప్పుడున్న ఒప్పందాలు సరిపోవడం లేదు. కొన్ని పత్రాలను సేకరించడానికి మాత్రమే అవి ఉపయోగపడుతున్నాయి. అనుమానితుల ఆస్తుల్ని జప్తు చేసి, వారి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బును తీసుకురాలన్నా, దేశీయ చట్టాల కింద పన్నులు వసూలు చేయాలన్నా వీలుపడటం లేదు. ఎక్కువ దేశాలతో ఎంఎల్ఏటీ ఉన్నట్లయితే తగిన సాక్ష్యాధారాలు చూపించి నిధుల్ని, ఖాతాల్ని స్తంభింపజేసే అవకాశం ఉంటుంది.¤ ఎన్నికల సందర్భంగా రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా పోలీసులను దుర్వినియోగం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ముందస్తు నిర్బంధంలో ఉన్నవారికి ఓటు వేసే హక్కు ఉందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇలా నిర్బంధంలో ఉన్న వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని తెలిపింది. ముందస్తు నిర్బంధంలో ఉన్న ఓటర్ల వివరాలను రిటర్నింగ్ అధికారులకు సంబంధిత అధికారులకు తెలియజేయాలని పేర్కొంది.
|
నవంబరు - 13
|
¤ కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్తోపాటు మరో పది మంది రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ¤ ఆహార భద్రత అంశంలో భారత్కు గొప్ప విజయం లభించింది. ఆహార భద్రతపై ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)తో ఉన్న సమస్యలకు సంబంధించి భారత్ ప్రతిపాదనను అమెరికా అంగీకరించింది. ఈ మేరకు రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. » ఈ ఒప్పందం ప్రకారం శాశ్వత పరిష్కారం దొరికే వరకు 'పీస్ క్లాజ్'ను నిరవధికంగా కొనసాగించాలన్న భారత్ ప్రతిపాదనకు డబ్ల్యూటీవోలో అమెరికా మద్దతు ప్రకటిస్తుంది. » భారత్ చేపట్టిన ఆహార భద్రత కార్యక్రమాన్ని నిరంతరాయంగా అమలు చేసేందుకు పీస్ క్లాజ్ ఎంతో ముఖ్యమైంది. బాలీ ఒప్పందం ప్రకారం పీస్ క్లాజ్ 2017 వరకు కొనసాగుతుంది. దాన్ని నిరవధికంగా కొనసాగించాలన్నది భారత్ వాదన. ఆహార భద్రతలో భాగంగా ప్రజలకు చౌకధరల్లో ఆహార ధాన్యాలను పంపిణీ చేసేందుకు వాటిని సేకరించి నిల్వ చేసేందుకు పీస్క్లాజ్ అవకాశం కల్పిస్తుంది. » ఆహార ధాన్యాలను నిల్వ చేసే అంశంలో అమెరికా నేతృత్వంలోని అభివృద్ధి చెందిన దేశాలు - అభివృద్ధి చెందుతున్న దేశాల (భారత్ సహా) మధ్య అభిప్రాయ బేధాలు ఏర్పడంతో జులైలో జెనీవాలో జరిగిన వాణిజ్య సౌకర్య ఒప్పందం (టీఎఫ్ఏ) ఆమోదం విషయంలో ప్రతిష్ఠంభన ఏర్పడింది. » డబ్ల్యూటీవోలోని రెండు ముఖ్యమైన దేశాల మధ్య అంగీకారం కుదరడంతో ఆ సంస్థ అత్యున్నత నిర్ణాయక విభాగమైన జనరల్ కౌన్సిల్ డిసెంబరు రెండో వారంలో భారత్ ప్రతిపాదనపై చర్చలు జరుపుతుంది. రైతుల నుంచి కనీస మద్దతు ధరకు ఆహార ధాన్యాలను సేకరించి, పేదలకు చౌక ధరలో వాటిని అందించడానికి వీలుగా వ్యవసాయ రాయితీల గణనకు నిబంధనలను సడలించాలని డబ్ల్యూటీవోను గతంలో భారత్ కోరింది. మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి విలువలో పది శాతం వరకు మాత్రమే ఆహార రాయితీలు ఇవ్వడానికి ప్రస్తుత నిబంధనలు అనుమతిస్తున్నాయి.
|
నవంబరు - 14
|
¤ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తమ నియోజక వర్గాల్లోని రెండు గ్రామాలను దత్తత తీసుకున్నారు. » ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అక్టోబరులో ప్రవేశ పెట్టిన 'ఆదర్శ్ గ్రామ యోజన' పథకంలో భాగంగా వాటిని ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చేయనున్నారు. » సోనియా గాంధీ రాయ్బరేలీలోని జగత్పూర్ ప్రాంతానికి చెందిన ఉద్వా గ్రామాన్ని, రాహుల్ గాంధీ అమేథిలోని జగదీష్పూర్ ప్రాంతానికి చెందిన దీహ్ అనే గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.¤ మరింత మంది ప్రేక్షకులను ఆకట్టుకునే లక్ష్యంతో దూరదర్శన్ తన నేషనల్ ఛానల్ను కొత్త సొబగులతో పునఃప్రారంభించాలని నిర్ణయించింది. » 'దూరదర్శన్ నేషనల్ - మన దేశ ఛానల్' పేరుతో ప్రజలకు పునరంకితం చేస్తున్నట్లు దూరదర్శన్ ప్రకటించింది. » సంప్రదాయ కుటుంబ విలువలు, విశ్వసనీయత, వ్యక్తి కంటే దేశం గొప్పది లాంటి తదితర ఇతివృత్తాలపై ఛానల్ దృష్టి సారించనున్నట్లు దూరదర్శన్ ప్రకటించింది.¤ దేశ రాజధాని దిల్లీలో 34వ 'భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన (ఐఐటీఎఫ్) - 2014' ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించారు. ఇందులో అన్ని రాష్ట్రాల పెవిలియన్లతోపాటు విదేశీ స్టాళ్లు ఏర్పాటయ్యాయి. » గతేడాది వరకు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ స్థానంలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టాళ్లు పెట్టారు.¤ కేంద్రీయ విద్యాలయాల్లో తృతీయ భాషగా జర్మన్ స్థానంలో సంస్కృతాన్ని చేర్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. » జర్మన్ భాష ఇకపై హాబీ తరగతుల అదనపు అంశంగా కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించింది.¤ జవహర్లాల్ నెహ్రూ 125వ జయంతి సందర్భంగా దిల్లీలోని ఆయన స్మృతి చిహ్నం శాంతి వనంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారి, కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ; మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరులు పుష్పాంజలి ఘటించారు. » కేంద్ర ప్రభుత్వం తరఫున ఎవరూ ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. స్వాతంత్య్ర సంగ్రామంలో నెహ్రూ కృషిని గుర్తు చేసుకుంటూ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ 'ట్విట్టర్'లో ఆయనకు అంజలి ఘటించారు. » నెహ్రూ జయంతి సందర్భంగా ప్రభుత్వం దిల్లీలోని తీన్మూర్తి భవన్ కాంప్లెక్స్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.¤ జాతీయ బాలల చలన చిత్రోత్సవ వేడుకలను దిల్లీలో ప్రముఖ సినీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ ప్రారంభించారు.¤ అక్షరాస్యతలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న కేరళ మరో ఘనత సాధించింది. దేశ ప్రజలందరికీ బ్యాంకు సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన 'ప్రధాన మంత్రి జన్ధన్ యోజన' లక్ష్యాన్ని అందుకోవడంలోనూ అగ్రస్థానంలో నిలిచింది. » నవంబరు 11 నాటికి వంద శాతం బ్యాంకు ఖాతాలున్న రాష్ట్రంగా రికార్డు సృష్టించింది. కేరళలో ఒక్కో కుటుంబం కనీసం ఒక్కో బ్యాంకు ఖాతాను కలిగి ఉన్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. » గోవా కూడా ఇదే ఘనతను సాధించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. » దేశవ్యాప్తంగా ఈ నెల 10 నాటికి జన్ధన్ యోజన కింద 7.24 కోట్ల ఖాతాలను ప్రజలు తెరచినట్లు ప్రభుత్వం వెల్లడించింది.¤ దేశంలోనే మొదటిసారిగా బెంగళూరు, మల్లేశ్వరంలోని మంత్రిమాల్లో రిమోట్ ఎఫ్ఐఆర్ సెంటర్ను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రారంభించారు. » పోలీస్ స్టేషన్లకు వెళ్లకుండా నేరుగా రిమోట్ ఎఫ్ఐఆర్ సెంటర్ ద్వారా బాధితులు ఫిర్యాదు చేయవచ్చు. ఏటీఎం తరహాలో చిన్నగదిలో ఉండే ఈ సెంటర్లో ఫిర్యాదు చేయడం సులభం. వెంటనే ఎఫ్ఐఆర్ కాపీని కూడా పొందే అవకాశం కల్పించారు.
|
నవంబరు - 16
|
¤ దేశంలోనే తొలిసారి మావోయిస్టుల ఏరివేతకు మహిళా టీమ్లు రంగంలోకి దిగాయి. నక్సల్స్ ఏరివేతకు మహిళా ప్రత్యేక దళాలు అడవుల్లో మోహరించాయి. దీంతో మహిళా కమాండోలు ఉన్న దేశాల సరసన భారత్ కూడా చేరింది. » సీఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో ఈ టీమ్లు పనిచేస్తాయి. » మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండే చత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్త్రా జిల్లాకు ఒక టీమ్, జార్ఖండ్కు మరో టీమ్ చేరాయి. సహచర పురుషుల జట్లుతోపాటు ఈ మహిళా టీమ్లు వెళ్లాయి. వీరందరితో రెండు ప్లాటూన్లను ఏర్పాటు చేశారు. ఒక్కో ప్లాటూన్లో 35 మంది మహిళా కమాండోలు ఉన్నారు. » ఈ మహిళలతో అడవుల్లోని గ్రామీణుల్లో అవగాహన కల్పిస్తారు. మవోయిస్టుల్లో కొత్తవారు చేరకుండా నిర్మూలించడం, ఉన్నవారిని జనజీవన స్రవంతిలో కలిసేలా చేయడం వీరి విధి.
|
నవంబరు - 17
|
¤ షారుక్ ఖాన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించిన 'హ్యపీ న్యూ ఇయర్' చిత్రం అరుదైన ఘనత సాధించింది. » ప్రఖ్యాత ఆస్కార్ లైబ్రరీలో ఈ చిత్రం చోటు దక్కించుకుంది. ఈ సినిమా స్క్రీన్ప్లేను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ తన శాశ్వత జాబితాలోకి అధికారికంగా తీసుకుంది. » సినిమా రంగానికి చెందిన విద్యార్థులు, ఫిల్మ్మేకర్స్, రచయితలు, నటుల పరిశోధన కోసం స్క్రీన్ప్లేలను ఈ సంస్థ భద్రపరచి ఉపయోగిస్తుంది. » ఇప్పటి వరకు 11,000 స్క్రిప్టులను ఈ సంస్థ లైబ్రరీలో ఉంచింది. » 'హ్యాపీ న్యూ ఇయర్' చిత్ర దర్శకురాలు ఫరాఖాన్.
|
నవంబరు - 18
|
¤ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించే దిశగా ఏర్పాటు చేసిన 'డిజిటల్ హంపి' ప్రదర్శన కార్యక్రమాన్ని కేంద్ర శాస్త్ర సాంకేతిక సహాయ మంత్రి సుజనా చౌదరి దిల్లీలో ప్రారంభించారు. » రెండు రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో కర్ణాటకలోని హంపి చరిత్ర, సంస్కృతుల డిజిటలైజ్ చేసిన అంశాలను ప్రదర్శిస్తారు.¤ కిసాన్ వికాస్ పత్రాలను (కేవీపీ) కేంద్ర ప్రభుత్వం మళ్లీ విడుదల చేసింది. దిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ కేవీపీలను కొందరు మహిళా రైతులకు అందజేశారు. » మొదటి దశలో పత్రాలపై కొనుగోలుదారుల పేరు లేకుండానే కిసాన్ వికాస్ పత్రాలను విక్రయిస్తారు. రూ.1000, రూ.5,000, రూ.10,000, రూ.50,000 విలువైన పత్రాలను విక్రయిస్తారు. ఈ పత్రాల్లో మదుపు చేసిన వారికి ఎలాంటి పన్ను రాయితీలు ఉండవు. ముందుగా తపాలా కార్యాలయాల్లో లభ్యమవుతాయి. తర్వాత ఎంపిక చేసిన ప్రభుత్వరంగ బ్యాంకు శాఖల్లో విక్రయిస్తారు. వీటిని ఎవరైనా కొనుగోలు చేయవచ్చు.¤ దేశంలోనే తొలిసారిగా ఎబోలా కేసు నమోదైంది. లైబీరియా నుంచి దిల్లీకి వచ్చిన భారత్కు చెందిన ఓ 26 ఏళ్ల వ్యక్తికి ఎబోలా వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. బాధితుడిని దిల్లీ విమానాశ్రయంలో ప్రత్యేక వార్డులో ఉంచి పర్యవేక్షిస్తున్నారు.
|
నవంబరు - 20
|
¤ 2జీ కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు సంచలనాత్మక ఉత్తర్వులు ఇచ్చింది. దర్యాప్తు నుంచి సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హాను తొలగించింది. ఈ కేసులోని కొంతమంది నిందితులను రక్షించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని వచ్చిన ఆరోపణల్లో ప్రాథమికంగా విశ్వసనీయత ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. 2జీ కుంభకోణం దర్యాప్తు బృందంలో సిన్హా తర్వాత సీనియర్ అయిన అధికారికి కేసు బాధ్యతలను అప్పగించింది. » 'సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్' స్వచ్ఛంద సేవా సంస్థ సిన్హాపై దాఖలు చేసిన ఆరోపణలపై విచారణ జరిపిన కోర్టు ఈ తీర్పు వెలువరించింది. ¤ 'దీన్దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన' గ్రామీణ విద్యుదీకరణకు రూ.43,033 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుతం ఉన్న రాజీవ్గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజన (ఆర్జీజీవీవై) స్థానంలో దీన్ని ప్రవేశపెడుతున్నారు. » తాజా పథకం కింద గ్రామాల్లో వ్యవసాయ, వ్యవసాయేతర ఫీడర్లను వేరు చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉప ప్రసార, పంపిణీ మౌలిక వసతులను బలోపేతం చేస్తారు. ఈ పథకం కింద పంపిణీ ట్రాన్స్ఫారాలు, ఫీడర్ల వద్ద మీటర్లు ఏర్పాటు చేస్తారు. » పట్టణ ప్రాంతాల్లో ఉప ప్రసార, పంపిణీ నెట్ వర్క్ను బలోపేతం చేయడానికి రూ.32,612 కోట్లతో సమీకృత విద్యుత్ అభివృద్ధి పథకం (ఐపీడీఎస్)కు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. » ఈశాన్య రాష్ట్రాల్లో విద్యుత్ ప్రసార, పంపిణీ నెట్వర్క్ను బలోపేతం చేసేందుకు రూ.5,200 కోట్లతో కొత్త పథకానికి ఆమోదం తెలిపింది. ¤ అణుధార్మికత తీవ్రతను నమోదు చేసేందుకు 100 ప్రధాన నగరాల్లో రేడియో ధార్మికత (రేడియేషన్) గుర్తింపు పరికరాల (డిటెక్టర్ల)ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. » సహజంగా వచ్చే అణుధార్మికతతోపాటు ఆస్పత్రులు, పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాల్లోని ప్రయోగశాలల నుంచి రేడియేషన్ అధికంగా వెలువడటం, అసాంఘిక శక్తుల నుంచి ముప్పు ఉండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై ఈ నిర్ణయం తీసుకుంది. » భారత పర్యావరణ ధార్మికత నమోదు వ్యవస్థ (ఇర్మాన్) ఆధ్వర్యంలో దేశంలో హైదరాబాద్తో సహా 100 నగరాల్లో అణుధార్మికత నమోదు పరికరాలు (న్యూక్లియర్ రేడియేషన్ డిటెక్టర్లు) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇర్మాన్ను ముంబయిలోని బాబా అటామిక్ పరిశోధనా కేంద్రం (బార్క్) నిర్వహిస్తోంది. » ఈ అణుధార్మికత నమోదు పరికరాలను హైదరాబాద్లోని ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) తయారు చేస్తోంది. ¤ కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ జాతీయ రహదారుల నిర్మాణ వ్యయంపై రాష్ట్రాలకు ఉన్న పరిమితిని రూ.25 కోట్ల నుంచి రూ.100 కోట్లకు పెంచింది. రూ.100 కోట్ల వ్యయ పరిమితికి మించిన రహదారుల ప్రాజెక్టులకు మాత్రం కేంద్రం అనుమతి తప్పనిసరి అని మంత్రిత్వశాఖ వెల్లడించింది. ¤ దక్షిణ కొరియా నుంచి రూ.2700 కోట్లతో రెండు యుద్ధ నౌకలను కొనుగోలు చేయడానికి ఉద్దేశించిన ఒప్పందాన్ని రక్షణ మంత్రిత్వశాఖ రద్దు చేసుకుంది. సముద్రంలో మందు పాతరలను గుర్తించి, వాటిని నిర్వీర్యం చేసేందుకు ఈ నౌకలను ఉపయోగిస్తారు. » టెండర్ నిబంధనలను ఉల్లంఘించి, మధ్యవర్తులకు ప్రమేయం కల్పించడం వల్లే ఒప్పందాన్ని రద్దు చేసినట్లు రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. |
నవంబరు - 21
|
¤ ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలను అతలాకుతలం చేసిన హుద్హుద్ తుపాన్ను కేంద్ర ప్రభుత్వం 'తీవ్రమైన విపత్తు'గా ప్రకటించింది. » దీని వల్ల ఈ రాష్ట్రాల్లో చేపట్టే పునర్నిర్మాణ, పునరావాస చర్యలకు దేశంలో ఏ ప్రాంతానికి చెందిన ఎంపీలైనా తమ ఎంపీల్యాడ్స్ నుంచి గరిష్ఠంగా రూ.ఒక కోటి వరకూ కేటాయించడానికి వీలవుతుంది. |
నవంబరు - 22
|
¤ కుంభకోణం కారణంగా బోఫోర్స్ శతఘ్నల ఒప్పందం బెడిసికొట్టిన తర్వాత 30 ఏళ్లకు సైన్యం కోసం కొత్తగా శతఘ్నల కొనుగోలుకు కేంద్రం నిర్ణయించింది. » రూ.15,750 కోట్లతో 814 శతఘ్నలను కొనేందుకు రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఆమోదం తెలిపారు. గతేడాది ప్రవేశపెట్టిన 'కొని, తయారు చేసే విధానం' కింద వీటిని సేకరించాలని నిర్ణయించారు. మొదట 100 శతఘ్నలను విదేశీ తయారీదారు నుంచి కొనుగోలు చేస్తారు. మిగతా వాటిని సాంకేతిక పరిజ్ఞాన బదిలీ కింద భారత్లోనే ఉత్పత్తి చేస్తారు. » రూ.8,200 కోట్లతో స్విట్జర్లాండ్ నుంచి 106 పిలాటస్ ప్రాథమిక శిక్షణ విమానాలను కొనుగోలు చేయాలని కూడా కేంద్రం నిర్ణయించింది. » 1986లో బోఫోర్స్ కుంభకోణం వెలుగు చూసినప్పటి నుంచి భారత్ శతఘ్నలను కొనుగోలు చేయలేదు.¤ 2015 జనవరి 13 నుంచి దేశవ్యాప్తంగా జల వారోత్సవాలు నిర్వహిస్తామని, వాటిలోనే 'మన జిల్లా - మన జలాలు' కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి వెల్లడించారు. ప్రతి జిల్లాలోనూ జల సంరక్షణ తప్పనిసరైన ప్రాంతాన్ని గుర్తించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని మంత్రి వెల్లడించారు. » 'జల్ గ్రామ్' పథకాన్ని వచ్చే ఏడాదిలో ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్న గ్రామాన్ని 'జల్ గ్రామ్'గా గుర్తిస్తారు. స్థానిక సంస్థల భాగస్వామ్యంతో కేంద్ర జలవనరుల, నదుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అక్కడ నీటి కొరత నివారణ దిశగా చర్యలు చేపడుతుంది. » 2015లో దేశవ్యాప్తంగా జల సంరక్షణ ఉత్సవాలను నిర్వహించాలని కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
|
నవంబరు - 24
|
¤ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. దివంగతులైన ముగ్గురు సభ్యులకు నివాళులర్పించిన అనంతరం ఎలాంటి కార్యకలాపాలు లేకుండానే ఉభయ సభలు మరుసటి రోజుకు వాయిదాపడ్డాయి. ¤ ప్రధాని భార్యగా ప్రభుత్వం నుంచి ఎంత భద్రత పొందడానికి తనకు హక్కు ఉందో తెలియజేయాలంటూ నరేంద్రమోదీ సతీమణి జశోదాబెన్ సమాచార హక్కు చట్టం కింద మెహ్సానా పోలీసులకు దరఖాస్తు చేశారు. » జశోదాబెన్ తన సోదరుడు అశోక్ మోదీతో కలిసి మెహ్సానా జిల్లాలోని ఉంఝా పట్టణంలో నివాసం ఉంటున్నారు. నరేంద్ర మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశాక ఆమెకు మోహ్సానా పోలీసులు భద్రత కల్పించారు. |
నవంబరు - 25
|
¤ జమ్ముకశ్మీర్, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. » జమ్ముకశ్మీర్లోని 15 నియోజక వర్గాల్లో 71.28 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. » రాంబాన్ జిల్లాలోని కబ్బీ పోలింగ్ కేంద్రంలో 121 ఏళ్ల వృద్ధురాలు నూర్బాబీ ఓటు వేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికల్లో ఆమె తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. » మొత్తం 87 నియోజక వర్గాలకు అయిదు దశల్లో నవంబరు 25 నుంచి డిసెంబరు 20 వరకు ఎన్నికలు జరగనున్నాయి. » ఝూర్ఖండ్లోని 13 నియోజకవర్గాల్లో దాదాపు 62 శాతం పోలింగ్ నమోదైంది. » మొత్తం 81 నియోజకవర్గాలకు అయిదు దశల్లో నవంబరు 25 నుంచి డిసెంబరు 20 వరకు ఎన్నికలు జరగనున్నాయి. » ఇరు రాష్ట్రాల్లో డిసెంబరు 23న ఓట్ల లెక్కింపు జరగనుంది. ¤ సీబీఐ డైరెక్టర్ ఎంపికకు సంబంధించి దిల్లీ ప్రత్యేక 'పోలీసు సంస్థాపన (సవరణ) చట్టం - 2014'ను కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ లోక్సభలో ప్రవేశపెట్టారు. » సీబీఐ డైరెక్టర్ కోసం ఉద్దేశించిన ఎంపిక కమిటీలో ప్రధాన మంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్సభలో విపక్షనేత సభ్యులుగా ఉంటారు. గుర్తింపు పొందిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు లేనప్పుడు విపక్షాల్లోని అతిపెద్ద పార్టీ నాయకుడికి చోటు కల్పించేందుకు సదరు చట్టంలోని సెక్షన్ 4(ఏ) ను సవరిస్తున్నట్లు బిల్లులో పొందుపరిచారు. ప్రస్తుతం విపక్షాల్లో ఏ పార్టీకీ ప్రధాన ప్రతిపక్ష హోదా పొందేందుకు అవసరమైన సంఖ్యలో సీట్లు రాకపోవండంతో ఈ సవరణ అవసరమైంది. కమిటీలోని ముగ్గురు సభ్యుల్లో ఏ ఒక్కరు రాకపోయినంత మాత్రాన నియామక ప్రక్రియ ఆగిపోదనే నిబంధన కూడా చేశారు. ¤ 40 మంది కంటే తక్కువ కార్మికులున్న సంస్థలకు వర్తించే కార్మిక చట్టాల సవరణ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. » కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖల సహాయ మంత్రి(స్వతంత్ర) బండారు దత్తాత్రేయ ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు అనుకూలంగా 49 మంది, వ్యతిరేకంగా 19 మంది ఓటు వేశారు. ¤ అలహాబాద్, గ్వాలియర్, జబల్పూర్, కాంచీపురంలో ఉన్న ట్రిపుల్ ఐటీలను ఒకే సంస్థ కిందికి తీసుకువచ్చే బిల్లును కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీ లోక్సభలో ప్రవేశపెట్టారు. ¤ దేశంలో మధుమేహ రోగుల సంఖ్య 6.3 కోట్లకు చేరిందనీ, చైనా తర్వాత మన దేశంలోనే ఎక్కువ మంది మధుమేహ రోగులున్నారని ఆరోగ్యశాఖ మంత్రి జె.పి.నడ్డా రాజ్యసభలో తెలిపారు. ¤ ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన 'స్వచ్ఛ భారత్' కార్యక్రమానికి ఊతమిచ్చేందకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది. 'స్వచ్ఛ భారత్ కోశ్' పేరిట దీన్ని ప్రారంభించింది. దీనికి సంబంధించిన మార్గ దర్శకాలను కూడా పేర్కొంది. » సామాజిక బాధ్యత కింద కార్పొరేట్ సంస్థలు ఇచ్చే నిధులతో పాటు ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చే విరాళాలను ఈ ప్రత్యేక ఖాతాలోకి మళ్లిస్తారు. కోటి రూపాయలకు పైగా ఇచ్చే వ్యక్తులు, రూ.20 కోట్లకు పైగా ఇచ్చే సంస్థల నుంచి ప్రధాని స్వయంగా నిధులు స్వీకరిస్తారని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ¤ శీతాకాల సమావేశాల్లో సభ సజావుగా సాగాలనే ఉద్దేశంతో రాజ్యసభలోని ప్రశ్నోత్తరాల సమయాన్ని మార్చారు. » ఉదయం 11 గంటలకు మొదలయ్యే ప్రశ్నోత్తరాల సమయాన్ని 12 గంటలకు మార్చారు. » రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీ ఈ మార్పును చేశారు.
|
నవంబరు - 26
|
¤ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధిపతి నియామకానికి సంబంధించిన చట్ట సవరణ బిల్లుకు లోక్సభ ఆమోద ముద్ర వేసింది. » ప్రధాని, భారత న్యాయమూర్తులతో పాటు లోక్సభ లో 'ఏకైక అతిపెద్ద పార్టీ' నేతను ఎంపిక సంఘంలో సభ్యుడిగా తీసుకునేందుకు బిల్లు వీలు కల్పిస్తుంది. లోక్సభలో గుర్తింపు పొందిన ప్రతిపక్ష నేత లేకపోవడంతో ఈ మార్పు చేశారు. ¤ 'అప్రెంటీస్ (సవరణ) బిల్లు 2014'ను రాజ్యసభ మూజువాణి ఓటింగ్ ద్వారా ఆమోదించింది. ¤ రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన రక్షణ మంత్రి మనోహర్ పారికర్ సహా 11 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ¤ రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయాన్ని 11 గంటలకు బదులు 12 గంటలకు మార్చాలనే ప్రతిపాదనకు సభ ఆమోదం లభించింది.
|
నవంబరు - 27
|
¤ సీబీఐ అధిపతి నియామకానికి సంబంధించిన సవరణ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. ఈ బిల్లును ఇప్పటికే లోక్సభ కూడా ఆమోదించింది.¤ భారత సందర్శనకు వచ్చే అమెరికా, జర్మనీ, ఇజ్రాయెల్ తదితర 43 దేశాలకు చెందిన పర్యటకుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ-వీసా సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. » కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ దిల్లీలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని అంచెలంచెలుగా ప్రపంచంలోని అన్ని దేశాలకు విస్తరిస్తామని ప్రకటించారు. » ఈ-వీసా 30 రోజులు చెల్లుతుంది. ఏడాదిలో రెండు సార్లు దీన్ని పొందే అవకాశం ఉంది. దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్కతా, హైదరాబాద్, బెంగళూరు, కోచీ, తిరువనంతపురం, గోవా అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఈ-వీసా కార్యకలాపాలను నిర్వహిస్తారు.¤ భారత్-పాక్ సరిహద్దుకు సమీపంలో ఉన్న రెండు సైనిక బంకర్లపై తీవ్రవాదులు జరిపిన దాడిలో పది మంది (ముగ్గురు పౌరులు, ముగ్గురు సైనికులు, నలుగురు తీవ్రవాదులు) మరణించారు.¤ ప్రధానమంత్రి జనధన్ యోజన (పీఎంజేడీవై) పథకానికి మంచి స్పందన రావడంతో ఖాతాల లక్ష్యాన్ని ప్రభుత్వం పదికోట్లకు పెంచింది. అందరికీ బ్యాంకు సేవలను చేరువ చేసే ఉద్దేశంతో ప్రధాని మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. » ఈ పథకం కింద జనవరి 26 వరకు 7.5 కోట్ల ఖాతాలను తెరవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, ఖాతాల సంఖ్య దాదాపు 8 కోట్లకు చేరడంతో లక్ష్యాన్ని పదికోట్లకు సవరించింది. నవంబరు 18 వరకు ఈ పథకం కింద మొత్తం 7.64 కోట్ల ఖాతాలు తెరవగా ఇందులో ప్రభుత్వరంగ బ్యాంకులవే 6.15 కోట్లు ఉన్నాయి.
|
నవంబరు - 28
|
¤ కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీ పాఠశాలల్లో) 6 - 8 తరగతుల విద్యార్థులకు ఇప్పటికిప్పుడు జర్మన్ భాష బదులు సంస్కృతాన్ని ప్రవేశపెట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. విద్యా సంవత్సరం మధ్యలో ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడతారని పేర్కొంది. » జస్టిస్ ఎ. ఆర్. దవే నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసుపై విచారణ జరిపింది. » మూడేళ్ల కిందట జర్మనీతో కుదిరిన ఒప్పందం మేరకు జర్మన్ను మూడో భాషగా ప్రవేశపెట్టారని, కానీ ఆ ఒప్పందం సరైంది కాదని, దాన్ని అనుసరించాల్సిన అవసరంలేదని కేంద్రం చేసిన వాదనపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. 'మీరు చేసిన పొరపాటుకు విద్యార్థులను ఎందుకు శిక్షిస్తున్నారు?' అని ప్రశ్నించింది. » సంస్కృతాన్ని ప్రవేశపెట్టాలన్న ఆలోచన మంచిదేనని, అయితే విద్యా సంవత్సరం మధ్యలో కాకుండా వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని సూచించింది.¤ కార్మిక చట్టాల సరళీకరణకు ఉద్దేశించిన కార్మిక చట్టం (రిటర్నుల దాఖలు మినహాయింపు, రిజిస్టర్ల నిర్వహణ మినహాయింపు) సవరణ బిల్లు - 2011కు పార్లమెంటు ఆమోద ముద్ర వేసింది. » కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రవేశపెట్టిన ఈ బిల్లును లోక్సభ ఆమోదించింది. ఈ బిల్లు ఇప్పటికే రాజ్యసభ ఆమోదం పొందింది. » తాజా బిల్లులో 1988 నాటి అసలు చట్టానికి సవరణలు చేశారు. వీటి ప్రకారం రిటర్నుల దాఖలు, రిజిస్టర్ల నిర్వహణ నుంచి మినహాయింపు ఉన్న చిన్న, మధ్య తరహా పరిశ్రమలను 9 నుంచి 16కు పెంచారు. అలాగే చిన్న తరహా పరిశ్రమల నిర్వచనాన్ని కూడా సవరించారు. 10 మందికి తగ్గకుండా 40 మందికి మించకుండా కార్మికులు ఉన్న సంస్థ/ పరిశ్రమ ఈ కేటగిరీలోకి వస్తుంది. దీంతో పెద్దసంఖ్యలో ఉన్న చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రిటర్నుల దాఖలు, రిజిస్టర్ల నిర్వహణ నుంచి మినహాయింపు లభిస్తుంది.¤ దేశ వ్యాప్తంగా రైల్వే ప్రయాణికులకు భద్రత కల్పించేందుకు ఆ శాఖ సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. భద్రతా పరమైన సహాయాన్ని పొందేందుకు నిరంతరం పనిచేసే టోల్ఫ్రీ నెంబరు (1800 111 322) ను ఏర్పాటు చేసింది.¤ ఆహార భద్రత చట్టాన్ని అమలు చేసేందుకు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం మరోసారి గడువు పెంచింది. 2013 జులైలో ఆహార భద్రత చట్టాన్ని ప్రవేశపెట్టారు. దాని ప్రకారం జులై 2014లో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాన్ని అమలు చేయాలి. పలు కారణాల దృష్ట్యా ఈ గడువును అక్టోబరు వరకు పొడిగించారు. » మౌలిక ఏర్పాట్లు, అర్హుల గుర్తింపు దృష్ట్యా ఆ గడువును మరో మూడు నెలలు పొడిగించినట్లు ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ¤ భారత్లో క్షయ, మందులకు లొంగని మొండి క్షయ (ఎండీఆర్ - టిబీ) రోగుల సంఖ్య అధికంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వం సేకరించిన గణాంకాల ప్రకారం 2013లో దేశవ్యాప్తంగా 14 లక్షల మందికి క్షయ, 23 వేల మందికి ఎండీఆర్ - టీబీ సోకినట్లు వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 'డబ్ల్యూహెచ్వో' కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
|
నవంబరు - 29
|
¤ మేఘాలయకు తొలిసారిగా రైలు అనుసంధానాన్ని కల్పిస్తూ మెందిపథర్ - గువహతి ప్యాసింజర్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గువహతిలో ప్రారంభించారు. » మిజోరాంలోని భాయ్ రబి - సాయ్రంగ్ లైనును బ్రాడ్గేజ్గా మార్చడానికి శంకుస్థాపన చేశారు. » ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ప్రముఖ ఆంగ్ల దినపత్రిక 'అసోం ట్రిబ్యూన్' ప్లాటినం జూబిలీ ఉత్సవాలను ప్రధాని మోదీ గువహతిలో ప్రారంభించారు. ¤ కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లాలోని కైగా అణు విద్యుత్ కేంద్రం విస్తరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ కేంద్రంలో నాలుగు యూనిట్లు ఉన్నాయి. ఒక్కొక్కటి 220 మెగావాట్ల చొప్పున విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాయి. » తాజాగా కేంద్ర ప్రభుత్వం అయిదు, ఆరో యూనిట్ల స్థాపనకు అనుమతించింది. వీటికి పర్యావరణ అనుమతి రావాల్సి ఉంది. ఒక్కో దాన్ని 700 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించనున్నారు. » ప్రస్తుతం ఉన్న నాలుగు యూనిట్ల ద్వారా ఉత్పత్తి అవుతున్న విద్యుత్తులో కర్ణాటకకు 28 శాతం, మిగిలిన మొత్తాన్ని గోవా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. |
నవంబరు - 30
|
¤ సాంస్కృతిక వారసత్వ సంపదకు ఆలవాలమైన పురాతన నగరాల పరిరక్షణ, అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 'హృదయ్' పేరుతో ప్రత్యేక పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. » ఈ పథకం కింద వారణాసి, గయ, అమృత్సర్, అజ్మీర్, మధురలతో పాటు తమిళనాడులోని కంచి, వేలంకణి లను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అభివృద్ధి చేస్తుంది. ఈ హెరిటేజ్ పట్టణాల అభివృద్ధికి అవసరమయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుంది. » 2014 - 2017 వరకు ఉన్న మూడేళ్ల కాలంలో ఆయా నగరాలను 'హృదయ్' పథకం కింద అభివృద్థి చేసేందుకు మోదీ సర్కారు రూ.500 కోట్లను ప్రతిపాదించింది. తొలివిడతగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.200 కోట్లను కేటాయించింది. » మౌలిక వసతుల పెంపు, విస్తృత సేవలను అందుబాటులోకి తేవడం, పరిశుభ్రత, సమాచార నెట్వర్క్ను పటిష్ఠం చేయడం లాంటివి 'హృదయ్' లక్ష్యాల్లో ప్రధానమైనవి. ¤ ఉగ్రవాద చర్యలను తిప్పికొట్టడంలో పేరొందిన జాతీయ భద్రత దళం (ఎన్ఎస్జీ)కు గుజరాత్లో స్థావరాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. » 2009లో ముంబయి, చెన్నై, కోల్కత, హైదరాబాద్ నగరాల్లో వీటిని ఏర్పాటు చేసింది. » పశ్చిమ ప్రాంతానికి సంబంధించి గుజరాత్ రాజధాని గాంధీనగర్కు సమీపంలోని రందేశన్లో 5వ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. » 240 మంది బ్లాక్ క్యాట్ కమెండోలకు స్థావరంగా ఉండే ఈ కేంద్రం వచ్చే ఏడాది నవంబరుకి అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. ¤ నాబార్డు (NABARD - నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్) అధ్యక్షుడితో సహా 87 మంది ఇతర ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర నిఘా కమిషన్ (సీవీసీ) సిఫార్సు చేసింది.
|
|
|